శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By వరుణ్
Last Updated : శుక్రవారం, 23 సెప్టెంబరు 2022 (09:11 IST)

అట్టుడికిపోతున్న ఇరాన్.. 31 మంది మహిళల మృతి!

iran protest
ఇరాన్ అట్టుడికిపోతోంది. హిజాబ్‌కు వ్యతిరేకంగా ఆ దేశ మహిళలు రోడ్డెక్కారు. హిజాబ్‌ను రద్దు చేయాలంటూ చేస్తున్న ఆందోళనలు రోజురోజుకూ తీవ్రతరమవుతున్నాయి. అనేక మంది మహిళలు వీధుల్లోకి వచ్చిన హిజాబ్‌కు వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్నారు. పైగా, హిజాబ్‌పై తన నిరసనను తెలిపేందుకు వీలుగా వెంట్రులను కూడా కత్తిరించుకున్నాడు. దీంతో ఆందోళనకారులను అణిచివేసేందుకు ఇరాన్ బలగాలు రంగంలో దిగాయి. ఆందోళనకారులకు, భద్రతా బలగాలకు మధ్య ఏర్పడిన ఘర్షణల్లో ఇప్పటివరకు 31 మంది చనిపోయారు. 
 
హిజాబ్‌ను సరిగా ధరించలేదన్న కారణంతో గత వారం మాసా అమీని అనే 22 యేళ్ల యువతిని నైతిక విభాగం పోలీసులు అరెస్టు చేశారు. వారి కస్టడీలో ఆ యువతి తీవ్రంగా గాయపడి, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూసింది. ఈ విషయం తెలిసిన ఆమె సొంత ప్రావిన్స్‌ కుర్దిస్థాన్‌లో నిరసనలు మొదలయ్యాయి. అవి క్రమంగా దేశమంతా వ్యాపించాయి. 
 
హిజాబ్‌ ధారణకు వ్యతిరేకంగా మొదలైన అల్లర్లు రోజురోజుకు తీవ్రరూపం సంతరించుకుంటున్నాయి. మహిళలు రోడ్డెక్కి నిరసనలు తెలుపుతున్నారు. రాజధాని టెహ్రాన్ సహా 30 నగరాల్లో గురువారం రోడ్డుపైకొచ్చి నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. 
 
హిజాబ్‌లను తొలగించి నడిరోడ్డుపై తగలబెట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నిరసనకు దిగిన ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీలకు పనిచెప్పారు. భాష్పవాయువు, వాటర్ కేనన్లను ప్రయోగించారు. 
 
మరికొన్ని చోట్ల కాల్పులు కూడా జరిపారు. ఈ క్రమంలో బలగాలు, నిరసనకారులకు మధ్య జరిగిన ఘర్షణల్లో ఒక్క కుర్దిస్థాన్‌లోనే 15 మంది బలయ్యారు. మజందరన్ ప్రావిన్సులో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం ఇరాన్ దేశ వ్యాప్తంగా ఉద్రిక్త వాతావరణం నెలకొనివుంది.