1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By వరుణ్
Last Updated : గురువారం, 30 నవంబరు 2023 (16:54 IST)

పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్‌కు ఊరట.. నిర్దోషిగా ప్రకటించిన కోర్టు

nawaz sharif
పాకిస్థాన్ మాజీ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్‌కు ఊరట లభించింది. ఆయనను పాకిస్థాన్ కోర్టు నిర్దోషిగా ప్రకటించింది. ఈ మేరకు ఇస్లామాబాద్ కోర్టు తీర్పును వెలువరించింది. ఆయనపై నమోదైన రెండు కేసుల్లోనూ నిర్దోషిగా విడుదల చేసింది. 
 
2018లో ఈ రెండు కేసుల్లో నవాజ్ షరీఫ్‌ను అవినీతి నిరోధక కోర్టు దోషిగా పేర్కొన్న విషయం తెల్సిందే. అవెన్ ఫీల్డ్ స్థిరాస్తుల కేసులో 10 ఏళ్ల జైలు శిక్ష విధించిన న్యాయస్థానం, అల్ అజీజియా ఉక్కు పరిశ్రమ కేసులో ఏడేళ్ల జైలు శిక్ష విధించింది.
 
అయితే, అనారోగ్యానికి చికిత్స చేయించుకోవాలంటూ 2019లో లండన్ వెళ్లిన నవాజ్ షరీఫ్ అక్కడే ఉండిపోయారు. నాలుగేళ్ల పాటు లండన్‌లో ప్రవాసం గడిపిన ఆయన స్వయం ప్రకటిత ప్రవాసం నుంచి ఇటీవలే బయటికి వచ్చారు. అక్టోబరులో పాకిస్థాన్‌‌లో అడుగుపెట్టారు. 
 
త్వరలో పాకిస్థాన్‌లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆయన రాక ప్రాధాన్యం సంతరించుకుంది. షరీఫ్ తిరిగి రావడంతో ఆయన సొంత పార్టీ పాకిస్థాన్ ముస్లిం లీగ్-నవాజ్ (పీఎంఎల్-ఎన్)లో ఉత్సాహం వెల్లివిరుస్తోంది. ఇప్పుడు కోర్టు ఆయనకు క్లీన్ చిట్ ఇవ్వడంతో పీఎంఎల్-ఎన్ నేతలు, కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు.