1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By వరుణ్
Last Updated : గురువారం, 23 ఫిబ్రవరి 2023 (08:50 IST)

దివాళా అంచున పాకిస్థాన్.. లగ్జరీ కార్ల వేలానికి సిద్ధం

pak flag
పాకిస్థాన్ దేశం దివాళా అంచున నిలిచింది. ఆర్థిక సంక్షోభం మరింత తీవ్రతరమైంది. దీంతో ఆ దేశ ప్రధానమంత్రి షరీఫ్ కఠిన, అసాధారణ నిర్ణయాలు తీసుకున్నారు. కేంద్ర మంత్రులకు వేతనాలు చెల్లించబోమని స్పష్టంచేశారు. మంత్రులు తమ బిల్లులను తామే చెల్లించుకోవాలని సూచించారు. ముఖ్యంగా, విదేశీ పర్యటనల సమయంలో ఖర్చులు తగ్గించుకోవాలని కోరారు. విమానాల్లో ఎకానమీ తరగతిలోనే ప్రయాణించాలని, ఫైవ్ స్టార్ హోటళ్ళలో బస చేయొద్దనీ కోరారు. ఆయన బుధవారం పలువురు కేంద్ర మంత్రులతో కలిసి విలేకరులతో మాట్లాడారు. 
 
కేంద్ర మంత్రులు తమ వద్ద ఉన్న లగ్జరీ కార్లను ప్రభుత్వానికి అప్పగిస్తే, వాటిని వేలం వేస్తామన్నారు. మంత్రులకు అవసరం అనుకుంటే భద్రత కోసం ఒక కారును మాత్రమే కేటాయిస్తామని తెలిపారు. మిగిలిన లగ్జరీ కార్లను వేలం వేస్తామని ఆయన ప్రకటించారు. దౌత్యవేత్తలు, విలేఖరులు తదితరులతో నిర్వహించే సమావేశాల కోసం చేసే ఖర్చును కూడా బాగా తగ్గించుకోవాలని సూచించారు.
 
మరోవైపు దివాళా అంచున నిలిచిన మిత్రదేశం పాకిస్థాన్‌‍ను ఆదుకునేందుకు డ్రాగన్ కంట్రీ చైనా ముందుకు వచ్చింది. చైనా డెవలప్‌మెంట్ బ్యాంకు రూ.7000 మిలియన్ డాలర్ల రుణం ఇచ్చేందుకు సమ్మతించింది. అతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) నిబంధనలకు లోబడి ఈ బిల్లును పాకిస్థాన్ జాతీయ అసెంబ్లీ ఆమోదించిన ఒక రోజు తర్వాత రుణం ఇచ్చేందుకు చైనా అంగీకరించడం గమనార్హం. 
 
దీంతో వారం రోజుల్లో పాకిస్థాన్‌కు చైనా నుంచి రూ.700 మిలియన్ డాలర్ల నిధులు అందనున్నాయి. ఈ విషయాన్ని పాకిస్థాన్ ఆర్థిక మంత్రి ఇషాక్ దార్ వెల్లడించారు. ఈ నెల 10వ తేదీ వరకు పాక్ సెంట్రల్ బ్యాంకు వద్ద 3.2 బిలియన్ డాలర్ల విదేశీ మారక ద్రవ్య నిల్వలు మాత్రమే ఉన్నాయి. ఈ నిధులు ఆ దేశ దిగుమతులకు మూడు వారాలకు మాత్రమే సరిపోయే అవకాశం ఉండటంతో దిగుమతులపై పాక్ నిషేధం విధించింది. ఇపుడు చైనా ప్రకటించిన ఆర్థిక సాయంతో ఊపిరి పీల్చుకుంది.