శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 25 నవంబరు 2020 (11:16 IST)

కామాంధులకు చుక్కలు.. ఇమ్రాన్ ఖాన్ సర్కారు కఠిన నిర్ణయాలు

భారత్‌లో మహిళలపై అత్యాచారాలు పెచ్చరిల్లిపోతున్న నేపథ్యంలో.. కఠినమైన చట్టాలు ఆమడ దూరంలోనే వున్నాయి. దిశ, నిర్భయ చట్టాలు వచ్చినా కామాంధుల ఆగడాలు ఏమాత్రం తగ్గట్లేదు. అయితే దాయాది దేశమైన పాకిస్థాన్ కామాంధులపై ఉక్కుపాదం మోపేందుకు ఇమ్రాన్ ఖాన్ సర్కారు సిద్ధమన్నట్లు తెలుస్తోంది. 
 
 
మహిళలు, చిన్నారులపై అత్యాచారాల కట్టడికై కఠినమైన చట్టాలు రూపొందిస్తున్నట్లు సమాచారం. ఇందులో భాగంగా అత్యాచారాలకు పాల్పడే దుండగుల లైంగిక పటుత్వం తగ్గేలా ఆపరేషన్లు(కాస్ట్రేషన్‌) నిర్వహించడం సహా బాధితులు ధైర్యంగా ముందుకు వచ్చి తమకు జరిగిన అన్యాయం గురించి ఫిర్యాదు చేసేలా అవగాహన కల్పించడం వంటి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టినట్లు తెలుస్తోంది.  
 
రెండేళ్ల క్రితం లాహోర్‌లో ఏడేళ్ల బాలిక అత్యాచారం, హత్య, ఇటీవల ఓ మహిళపై సామూహిక లైంగికదాడి ఘటనలపై దేశవ్యాప్తంగా తీవ్ర స్థాయిలో నిరసనలు వెల్లువెత్తడంతో ఇమ్రాన్‌ ఖాన్‌ ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అయితే దీనికి సంబంధించి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.
 
ఇందుకు సంబంధించిన బిల్లుకు పాకిస్తాన్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ ఆమోదం తెలిపారని స్థానిక మీడియా తెలిపింది. మంగళవారం నాటి కేబినెట్‌ సమావేశంలో భాగంగా న్యాయ శాఖ ముసాయిదాను ప్రవేశపెట్టగా ఆయన ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది.