బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By
Last Updated : ఆదివారం, 31 మార్చి 2019 (11:16 IST)

బ్రెయిన్ డెడ్ అయిన మహిళ పండంటి బిడ్డకు జన్మనిచ్చింది... ఎక్కడ?

సాధారణంగా ఏదేని ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఏమాత్రం స్పృహ లేకుండా, చికిత్సకు స్పందించకుండా ఉండే క్షతగాత్రులను బ్రెయిన్ డెడ్‌గా ప్రకటిస్తుంటారు. ఇలాంటి వారి శరీరం నుంచి సేకరించే ఆర్గాన్స్‌ను ఇతరులకు అమర్చి ప్రాణదానం చేస్తుంటారు. అయితే, పోర్చుగల్ దేశంలో బ్రెయిన్ డెడ్ అయిన ఓ క్రీడాకారిణి రెండు నెలల తర్వాత పండండి బిడ్డకు జన్మనిచ్చింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఈ దేశానికి చెందిన కేథరీనా సెకీరా(26) అనే అంతర్జాతీయ క్రీడాకారిణి గతేడాది డిసెంబరులో ఆస్మా అటాక్ కారణంగా బ్రెయిన్ డెడ్ అయింది. అప్పటికే ఆమె 17వారాల గర్భవతి. దీంతో ఆమెను ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందిస్తూ వచ్చారు. అంటే బిడ్డకు జన్మనిచ్చే వరకు ఆమెకు చికిత్స అందించాలని కుటుంబసభ్యులు, డాక్టర్లు నిశ్చయించుకున్నారు. 
 
పోర్చుగల్ చట్టం ప్రకారం బిడ్డను అమానుషంగా చంపడం కూడా నేరం. దీంతో దాదాపు 32 వారాల పాటు ఆసుపత్రి మంచంపైనే వెంటిలేటర్‌తో కేథరీనాకు నియోనాటల్ ఆస్పత్రిలో చికిత్స అందిస్తూ వచ్చారు. గురువారం కేథరీనా మగబిడ్డకు జన్మనిచ్చింది. బిడ్డ పూర్తి ఆరోగ్యంతో ఉండటంతో కేథరీనా కుటుంబసభ్యుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. 
 
అదేసమయంలో తమ కూతురు ఇక తమ కళ్ల ముందు కనపడదనే విషయాన్ని తలుచుకుని కన్నీటి పర్యంతమయ్యారు. కనీసం జన్మనిచ్చిన బిడ్డను కూడా చూసుకోలేని పరిస్థితి తమ కూతురికి వచ్చిందంటూ కుమిలిపోయారు. గత శుక్రవారం కేథరీనాకు వారు అంత్యక్రియలు నిర్వహించారు. పోర్చుగల్‌లో ఈ తరహా ప్రసవం జరగడం ఇది రెండోసారి కావడం గమనార్హం.