గురువారం, 28 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 8 మార్చి 2021 (11:45 IST)

ప్రపంచ ఔషధ కేంద్రంగా భారత్... ప్రపంచాన్ని కాపాడింది: ఆమెరికా శాస్త్రవేత్త

కరోనా కష్టకాలంలో ప్రపంచాన్ని భారత్ చేస్తున్న మేలును ప్రతి ఒక్కరూ కొనియాడుతున్నారు. ప్రపంచ ఔషధ కేంద్రంగా భారత్ అవతరించిందన్నారు. ముఖ్యంగా, భారత్ తయారు చేస్తున్న కోవిడ్ వ్యాక్సిన్ తయారీ ప్రపంచానికి ఓ బహుమతి అని అమెరికాకు చెందిన ప్రఖ్యాత శాస్త్రవేత్త పీటర్ హాట్జ్ చెప్పుకొచ్చారు. 
 
కొవిడ్‌-19పై ఇటీవల నిర్వహించిన వెబినార్‌లో పీటర్‌ మాట్లాడుతూ.. ప్రముఖ అంతర్జాతీయ సంస్థలతో కలిసి కొవిడ్‌ వ్యాక్సిన్‌ను తయారు చేయడం ద్వారా భారత్‌ కరోనా మహమ్మారి నుంచి ప్రపంచాన్ని కాపాడిందన్నారు. భారత్‌ భాగస్వామ్యాన్ని తక్కువ అంచనా వేయడానికి లేదన్నారు. 
 
కొవిడ్‌ విజృంభిస్తున్న సమయంలో భారత్‌ ఔషధ రంగంలో తనకున్న అపార అనుభవం, విజ్ఞానంతో ప్రపంచ ఔషధ కేంద్రంగా మారిందని కొనియాడారు. భారత్‌లో కొవిడ్‌ వ్యాక్సిన్‌ తయారీ ప్రపంచానికి ఒక బహుమతి అన్నారు. 
 
బ్రిటన్‌కు చెందిన ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్‌ను భారత్‌కు చెందిన సీరం సంస్థ తయారు చేస్తుండగా, దేశీయంగా హైదరాబాద్‌కు చెందిన భారత్‌ బయోటెక్‌ సంస్థ ఐసీఎంఆర్‌తో కలిసి కొవాగ్జిన్‌ను తయారు చేసిందని తెలిపారు. కరోనా మహమ్మారిపై భారత్‌ చేస్తున్న పోరాటం ప్రపంచానికే స్ఫూర్తిదాయకమని ప్రశంసించారు.