1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 9 ఏప్రియల్ 2020 (19:19 IST)

మా ప్రజల ప్రాణాలు కాపాడేందుకు భారత్ సాయం చేసింది : శ్రీలంక అధ్యక్షుడు

కరోనా వైరస్ కబళించిన వేళ ప్రపంచ దేశాలన్నీ భారత్ వైపు చూపుస్తున్నా. ఇపుడు అన్ని దేశాలకు భారత్ ఆపద్బాంధువుగా కనిపిస్తోంది. దీనికి కారణం కరోనా వైరస్‌ బారినపడినవారికి వాడే మందుల్లో కాస్త మెరుగైన ఔషధం భారత్ వద్ద పుష్కలంగా ఉండటమే. దీంతో ఆ ఔషధాన్ని తమకు కూడా పంపించాలని అనేక ప్రపంచ దేశాలు విజ్ఞప్తి చేస్తున్నాయి. ఇప్పటికే అమెరికా, స్పెయిన్ వంటి అగ్రదేశాలు ఈ మందును భారీ మొత్తంలో దిగుమతి చేసుకుంటున్నాయి. 
 
ఈ పరిస్థితిలో పొరుగుదేశమైన శ్రీలంకను కూడా భారత్ ఆదుకుంది. ఇదే విషయాన్ని శ్రీలంక అధ్యక్షుడు గొటబయి రాజపక్సే ఓ ట్వీట్ ద్వారా తెలిపారు. కరోనా వంటి విపత్కర పరిస్థితులు ఎదుర్కొంటున్న సమయంలో తమ ప్రజల ప్రాణాలను కాపాడడానికి ఔషధాలు పంపి భారత్‌ చేసిన సాయానికి కృతజ్ఞతలు తెలిపారు. 
 
శ్రీలంకలోనూ కరోనా తీవ్ర ప్రభావం చూపుతున్న నేపథ్యంలో భారత ప్రభుత్వం ఆ దేశానికి పది టన్నులతో కూడిన కరోనా నిర్ధారణ, చికిత్సకు అత్యవసరమైన వైద్య పరికరాలతో పాటు ఔషధాలు, వైద్యుల రక్షణ సామగ్రి, మాస్కులను శ్రీలంకకు భారత్ తాజాగా ప్రత్యేక విమానంలో పంపించింది. తమను ఆదుకోవాలని ఇటీవల భారత్‌కు శ్రీలంక చేసిన విజ్ఞప్తి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం వాటిని పంపింది.
 
'భారత ప్రధాని నరేంద్ర మోడీ, ప్రభుత్వం, ప్రజలకు నేను హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. శ్రీలంకకు ప్రత్యేక విమానం ద్వారా అవసరమైన ఔషధాలు పంపి భారత్ సాయం చేసింది. కొవిడ్‌-19తో సంక్షోభ పరిస్థితులు ఎదుర్కొంటున్న సమయంలో గొప్ప సాయాన్ని అందించారు' అని గొటబయ రాజపక్స ట్వీట్ చేశారు.
 
అంతేకాకుండా, భారత్ పంపిన వైద్య పరికరాలు, ఔషధాల ఫొటోలను ఈ సందర్భంగా ఆయన పోస్ట్ చేశారు. 'శ్రీలంక ప్రజలకు, ప్రభుత్వానికి భారత ప్రజలు, ప్రభుత్వం పంపుతున్న గిఫ్ట్' అని ఓ లేఖను కూడా శ్రీలంకకు భారత్ పంపింది. దాన్ని కూడా ఆయన పోస్ట్ చేశారు.