బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 9 ఏప్రియల్ 2020 (13:39 IST)

కరోనా వైరస్ : అమెరికాలో 11 మంది ఇండియన్స్ మృతి

కరోనా వైరస్ దెబ్బకు అమెరికా అతలాకుతలమైంది. ముఖ్యంగా, న్యూయార్క్‌ నగరం చిన్నాభిన్నమైంది. శ్రీమంతుల నగరంగా పేరుగాంచిన న్యూయార్క్‌లో కరోనా వైరస్‌ బారిపడుతున్న వారి సంఖ్యతో పాటు.. మరణిస్తున్న వారి సంఖ్య కూడా విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో అమెరికాలో ఈ వైరస్ బారినపడి ఇప్పటికే 14 వేల మందికిపైగా మృత్యువాతపడ్డారు. బుధవారం ఒక్కరోజే 2 వేల మంది మృత్యువాతపడ్డారు. 
 
అమెరికాలో ఉన్న భారతీయులపై కూడా కరోనా ఎఫెక్ట్ తీవ్రంగానే ఉంది. లాక్‌డౌన్ కార‌ణంగా విమాన స‌ర్వీసులు నిలిచిపోవ‌డంతో ఎంతో మంది భార‌తీయులు అమెరికాలోనే ఉండిపోయారు. అయితే అక్క‌డ క‌రోనా తీవ్ర‌త ఎక్కువ‌గా ఉండ‌టంతో భార‌తీయుల్లో కూడా చాలామంది ఆ మ‌హ‌మ్మారి బారిన‌ప‌డ్డారు. ఇప్పటివరకు 11 మంది భారతీయులు కరోనాతో చనిపోయినట్లు సమాచారం. 
 
వీరిలో 10 మంది న్యూయార్క్‌, న్యూజెర్సీ నగరాలకి చెందిన వారు కాగా, ఒక్కరు ఫ్లోరిడాలో నివాసం ఉంటన్న వ్యక్తిగా అధికారులు గుర్తించారు. మృతుల్లో నలుగురు ట్యాక్సీ డ్రైవర్ల‌ని తెలిసింది. 
 
ఇదిలావుంటే న‌లుగురు మ‌హిళ‌లు స‌హా మరో 16 మంది భారతీయులు క‌రోనా ల‌క్ష‌ణాల‌తో హోమ్ క్వారెంటైన్‌లో ఉన్నారు. వీరిలో 8 మంది న్యూయార్క్‌లో, ముగ్గురు న్యూజెర్సీలో, మిగిలినవారు టెక్సాస్, కాలిఫోర్నియా రాష్ట్రాల్లో ఉన్నారు.