1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 20 ఆగస్టు 2021 (16:24 IST)

ఇండియన్ ఎంబసీలో తాలిబన్ల సోదాలు - ఫైళ్లు కాల్చివేత - కార్లు స్వాధీనం

ఆప్ఘనిస్థాన్ దేశ రాజధాని కాబూల్‌లో ఉన్న భారత రాయబార కార్యాలయంలో తాలిబన్ తీవ్రవాదులు సోదాలు నిర్వహించారు. ఆ సమయంలో వారి కంటికి కనిపించిన అన్ని రకాల ఫైళ్లు, పత్రాలను కాల్చివేశారు. అలాగే, ఎంబసీకి చెందిన అన్ని రకాల కార్లను స్వాధీనం చేసుకున్నారు. కాంద‌హార్‌, హీర‌త్ న‌గ‌రాల్లో ఈ ఘ‌ట‌న‌లు చోటు చేసుకున్నాయి.
 
ఆ ప్రాంతాల్లోని రెండు రాయ‌బార కార్యాల‌యాల్లో అన్ని వ‌స్తువులనూ తాలిబ‌న్లు ప‌రిశీలించారు. మ‌రోవైపు, పౌరుల ఇళ్ల‌లోనూ తాలిబ‌న్లు త‌నిఖీలు చేప‌డుతున్నారు. 
 
కాగా, కాబూల్‌లో భారత్ ఎంబసీ ఉండగా.. దేశంలోని నాలుగు ఇతర నగరాల్లో కాన్సులేట్స్ వున్నాయి. కొన్ని వారాల క్రిత‌మే భార‌త్ మ‌జార్ యే ష‌రీఫ్‌లోని రాయ‌బార కార్యాల‌యాన్ని మూసి వేసింది. ఇప్ప‌టికే ఆఫ్ఘ‌న్ నుంచి భార‌త్ త‌మ సిబ్బందిని వెన‌క్కి తీసుకొచ్చింది.
 
మరోవైపు, తాలిబన్ల ఆక్రమణలతో అన్ని దేశాలు తమతమ రాయబారులు, దౌత్యవేత్తలను ఆఫ్ఘనిస్థాన్ నుంచి తరలించేశాయి. భారత్ కూడా కాబూల్‌లోని ఎంబసీ సహా.. వివిధ నగరాల్లో ఉన్న కాన్సులేట్లలోని దౌత్యవేత్తలను వెనక్కు తీసుకొచ్చింది. 
అయితే, కాబూల్ రాయబార కార్యాలయం నుంచి మన అధికారులను తీసుకెళ్లొద్దంటూ భారత్‌కు తాలిబన్లు విజ్ఞప్తి చేశారు. ఏమీ చేయబోమంటూ హామీ ఇచ్చారు. తాలిబన్ రాజకీయ విభాగం అధిపతి అయిన అబ్బాస్ స్టానిక్జాయ్.. భారత ప్రభుత్వానికి ఈ సందేశాన్ని చేరవేశారని అధికారులు చెబుతున్నారు. 
 
‘‘కాబూల్ రాయబార కార్యాలయంలోని ఏ ఒక్క అధికారికీ హాని తలపెట్టబోం. లష్కరే తాయిబా, జైషే మహ్మద్ వంటి ఉగ్రవాద సంస్థల మాదిరి ఎంబసీపై దాడులు చేయం’’ అని హామీ ఇచ్చిందట.
 
అయితే, ఆ ఉగ్రవాద సంస్థ వల్ల భవిష్యత్‌లో కలిగే ముప్పును దృష్టిలో పెట్టుకుని వారి విజ్ఞప్తిని భారత్ తిరస్కరించిందని అధికారులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే అధికారులను కాబూల్ ఎయిర్ పోర్టుకు తరలిస్తుండగా.. కొందరు తాలిబన్లు అడ్డుకుని వారి వ్యక్తిగత సామగ్రిని లాగేసుకున్నట్టు తెలుస్తోంది. మంగళవారం నాటికి ఆ దేశంలోని రాయబారి రుద్రేంద్ర టాండన్ సహా అందరినీ ఆఫ్ఘనిస్థాన్ నుంచి ఆర్మీ సీ17 విమానంలో భారత్ తీసుకొచ్చేసింది.