గురువారం, 18 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : శనివారం, 20 మార్చి 2021 (09:54 IST)

ఆమెకి ఏడాదిలోనే రెండుసార్లు కరోనా.. ఇంతకీ దుబాయ్‌లో ఏమైందో తెలుసా?

29 ఏళ్ల ఓ భారతీయ మహిళ ఏడాది కాలం వ్యవధిలోనే రెండుసార్లు కరోనాను జయించింది. వివరాల్లోకి వెళ్తే.. దుబాయ్‌లోని మెడోర్ ఆస్పత్రిలో నర్సుగా పనిచేస్తున్న బ్లెస్సీ బాబు(29) అనే భారతీయురాలు తొలిసారి గతేడాది మార్చిలో కరోనా బారిన పడింది.

అప్పుడు ఆమె 5 నెలల గర్భవతి కూడా. దాంతో ఆమె కుటుంబ సభ్యుల్లో ఆందోళన నెలకొంది. పైగా మహమ్మారి అప్పుడే యూఏఈలో వ్యాపించడం మొదలైంది. దాంతో అక్కడ దాని గురించి అంతగా తెలియని పరిస్థితి.

ఇక గర్భిణీ కావడంతో ఎలాంటి ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయోనని వారు కంగారు పడ్డారు. సాధారణ టెస్టుల కోసం ఆస్పత్రికి వెళ్లినప్పుడు బ్లెస్సీకి కరోనా సోకిన విషయం తెలిసింది. దాంతో అదే ఆస్పత్రిలో చికిత్స కోసం చేరిందామె. 
 
రెండు వారాల తర్వాత నెగెటివ్ రావడంతో డిశ్చార్జి అయింది. ఎలాంటి ఆరోగ్య సమస్యలు తలెత్తకపోవడం, పూర్తి ఆరోగ్యంగా ఇంటికి తిరిగి రావడంతో ఆమె కుటుంబ సభ్యులు ఊపిరిపీల్చుకున్నారు. ఇలా మొదటిసారి కొవిడ్‌ను విజయవంతంగా జయించిన బ్లెస్సీ ఈ ఏడాది ఫిబ్రవరి 26న రెండోసారి వైరస్ బారిన పడింది.

ఈసారి భర్తతో పాటు ఆరు నెలల పాప, ఆమె తల్లిలో కూడా కరోనా లక్షణాలు కన్పించాయి. దాంతో వెంటనే నలుగురు కొవిడ్ టెస్టు చేయించుకోగా బ్లెస్సీతో పాటు ఆమె భర్తకు పాజిటివ్ అని తేలింది.

ఇద్దరూ ఇంట్లోనే ఓ గదిలో క్వారంటైన్‌లో ఉన్నారు. రెండు వారాల తర్వాత ఇద్దరూ కోలుకున్నారు. ఇలా బ్లెస్సీ ఏడాది కాలం వ్యవధిలోనే రెండుసార్లు మహమ్మారిని జయించింది. ఇప్పుడు యధావిధిగా తన విధులకు హాజరవుతున్నట్లు ఆమె పేర్కొంది.