1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 8 ఏప్రియల్ 2020 (16:57 IST)

కరోనా మహమ్మారి.. అమెరికాలో 12,878 మంది మృతి.. భారత్‌పై ట్రంప్

అమెరికాలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. అమెరికాలో ఇప్పటివరకు 3,99,667 కరోనా కేసులు నమోదయ్యాయి. మంగళవారం ఒక్కరోజే 1900 మంది కరోనా వైరస్ కారణంగా మృతి చెందారు. అమెరికాలోని న్యూయార్క్‌లో పరిస్థితులు మరింత దారుణంగా ఉన్నాయి.

అక్కడ ఇప్పటివరకు 1.38 లక్షల మంది కరోనా బారిన పడగా, 5,400 మంది ప్రాణాలు కోల్పోయారు. న్యూయార్క్ పక్కనే ఉన్న న్యూజెర్సీలోనూ 1200 మంది మృతి చెందారు. అక్కడ 44,416 మంది కరోనా బారినపడ్డారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 12,878కి పెరిగింది.
 
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ భారత్‌పై ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం ట్రంప్ భారత్‌పై ప్రశంసల వర్షం కురిపించారు.  హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ను భారత్ తమకు ఎగుమతి చేయకపోతే ప్రతీకార చర్యలు ఉంటాయని ట్రంప్ హెచ్చరించారు. ఆ ఔషధాల ఎగుమతిపై నిషేధం విధించిన భారత్‌ మళ్లీ ఎగుమతి చేస్తామని ప్రకటించింది. దీనిపై ట్రంప్‌ మరోసారి మాట్లాడుతూ, తాను ఇటీవల చేసిన వ్యాఖ్యలపై వెనక్కి తగ్గి భారత్‌పై ప్రశంసలు కురిపించారు.
 
'హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ను ఇప్పటికే కొన్ని మిలియన్‌ డోసులు కొన్నానని... దాదాపు 29 మిలియన్ల డోసులు కొన్నాను. భారత ప్రధాని మోదీతో మాట్లాడినట్లు ట్రంప్ వ్యాఖ్యానించారు. భారత్‌ నుంచి మాకు ఆ ఔషధాలు పెద్ద మొత్తంలో రావాల్సి ఉంది. వాటిని పంపిస్తారా? అని మోదీని అడిగాను. సానుకూలంగా స్పందించారు. ఆయన చాలా మంచి దృక్పథంతో ఉన్నారు. భారత్‌కు కూడా ఆ ఔషధాలు చాలా అవసరం, అందుకే వాటి ఎగుమతులను ఆపేశారని తెలిపారు. పనిలో పనిగా భారత్‌పై ప్రశంసలు కురిపించారు.