శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 7 అక్టోబరు 2020 (15:25 IST)

ఇమ్రాన్ ఖాన్‌కు ముచ్చెమటలు పోయిస్తున్న గోధుమలు!

పాకిస్థాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్‌కు గోధుమలు ముచ్చెమటలు పోయిస్తున్నారు. ఈ గోధుమలు ఆయన పదవికి ఎసరు తెచ్చేలా కనిపిస్తున్నాయి. దీంతో ఆయన తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. గోధుమలు ఎలా ఇమ్రాన్‌ ఖాన్‌ను ఇబ్బంది పెడుతున్నాయనే కదా మీ సందేహం. అయితే, ఈ కథనం చదవండి. 
 
ప్రపంచంలో అధికంగా గోధుమలు పండించే దేశాల్లో పాకిస్థాన్ ఒకటి. ఈ దేశం నుంచి ప్రపంచంలోనే అనేక దేశాలకు గోధుమలు ఎగుమతి అవుతుంటాయి. అలాంటిది ఇపుడు పాకిస్థాన్‌లో గోధుమల కొరత ఏర్పడింది. దీనికి కారణం దిగుబడి గణనీయంగా తగ్గిపోవడమే. ఫలితంగా దేశంలో గోధుమల ధరలు ఆకాశానికంటాయి. ప్రస్తుతం కిలో గోధుమల ధర రూ.60కి చేరుకుంది. పైగా, 40 కేజీల గోధుమల బస్తా ధర రూ.2400గా పలుకుతోంది. పాకిస్థాన్ దేశ చరిత్రలో గోధుమలు ఇంత రేటుకు పలకడం ఇదే తొలిసారికావడం గమనార్హం. దీంతో ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ముందు ఇప్పుడు గోధుమల రూపంలో కొత్త సమస్య ఏర్పడింది. 
 
ప్రస్తుతం దేశంలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా వచ్చే డిసెంబరు నాటికి వీటి ధర మరింతగా పెరుగుతుందని ఆహార నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దీంతో పెరిగిన ధరలను కిందికి దించేందుకు తగిన చర్యలు తీసుకోవాలంటూ ఇమ్రాన్ ఖాన్‌పై ఒత్తిడి పెరుగుతోంది. 
 
గోధుమలను పండించే రైతులకు నిధులను సమకూర్చే ఆలోచనలో ఉన్నామని చెప్పడం మినహా ఇమ్రాన్ మరేమీ చేయలేదన్న విమర్శలూ వస్తున్నాయి. వాస్తవానికి పంటలను సకాలంలో ఉత్పత్తి చేస్తే, ధరలను నియంత్రించే వీలుంటుందని వ్యాఖ్యానిస్తున్న వ్యవసాయ రంగ నిపుణులు, ఈ మేరకు నియంత్రిత చర్యలు చేపట్టాలని ప్రభుత్వానికి సలహాలు ఇస్తున్నారు. 
 
ప్రస్తుతం పాక్ కు రష్యా నుంచి గోధుమలు దిగుమతి అవుతున్నాయి. గడచిన నెల రోజుల వ్యవధిలో దాదాపు రెండు లక్షల మెట్రిక్ టన్నులను పాక్ దిగుమతి చేసుకుందంటే, పరిస్థితి ఎంత దిగజారిపోయిందో అర్థం చేసుకోవచ్చు. ఇదేసమయంలో పంచదార ధర పెరుగుతూ ఉండటం, చికెన్ ధర చుక్కలను తాకుతుండటం, సమీప భవిష్యత్తులో ఇమ్రాన్ ఖాన్‌కు మరిన్ని ఇబ్బందులు తెచ్చి పెట్టడం ఖాయమని నిపుణులు హెచ్చరిస్తున్నారు.