శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. ఎన్నికలు 2019
  3. లోక్ సభ ఎన్నికలు 2019 వార్తలు
Written By
Last Updated : శుక్రవారం, 22 మార్చి 2019 (21:56 IST)

అందుకే భారత్‌కు ముస్లిం-క్రైస్తవులు ప్రధానమంత్రి పదవిని చేపట్టలేకపోయారు... ఎవరు?

ఎన్నికల వేళ బిబిసి నిర్వహించిన వాయిస్ ఆఫ్ తమిళుల కార్యక్రమంలో పలువురు వక్తలు తమ అభిప్రాయాలను తమిళనాడులోని పలు కళాశాలలకు చెందిన విద్యార్థినీవిద్యార్థులతో పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో వి.సి.కె పార్టీకి చెందిన తిరుమావలవన్ మాట్లాడుతూ... భారతదేశంలోని మెజారిటీలో వున్న వర్గ ప్రజలే ప్రధానిని నిర్ణయిస్తారు. అందుకే ముస్లిం లేదా క్రైస్తవల నుంచి ఇప్పటివరకూ భారతదేశానికి ప్రధాని కాలేకపోయారని చెప్పుకొచ్చారు.
 
శుక్రవారం నాడు బిబిసి తమిళ్ ఏర్పాటు చేసిన వాయిస్ ఆఫ్ తమిళుల కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో విద్యార్థినీవిద్యార్థులు పాల్గొన్నారు. మెజారిటీ కమ్యూనిటీ వున్నందున భారతదేశంలో ఇలా మైనారిటీ వర్గాలకు చెందినవారు ప్రధానమంత్రి కాలేకపోయారని అన్నారు. ఈ వాస్తవాన్ని అందరూ అంగీకరించాల్సిందేనన్నారు. 
 
ఇంకా ఆయన మాట్లాడుతూ.. కులాలకు సంబంధించిన అసమానతలపై మహనీయులు తిరువళ్లువర్, బుద్ధుడు వంటివారు పోరాటం చేసినా ఆ అసమానతలు ఇప్పటికీ అలాగే వున్నాయన్నారు. వాటిని రూపుమాపేందుకు ప్రజలు నడుం బిగించాల్సిన అవసరం వుందన్నారు.
 
చిన్నచిన్న పార్టీలు పెద్ద పార్టీలతో పొత్తు పెట్టుకోవడానికి కారణాలను వివరిస్తూ, మైనార్టీ ప్రజలకు చెందిన పార్టీలు జాతీయ పార్టీలతో పొత్తు పెట్టుకోవడం వల్ల వారి సమస్యలను చట్టసభల్లో వివరించే అవకాశం దక్కుతుందనీ, అందుకే తాము పొత్తు పెట్టుకున్నట్లు వివరించారు. అలాగే రాజకీయాల్లో మహిళలకు దక్కుతున్న స్థానం అత్యల్పమన్న విద్యార్థునుల ప్రశ్నపై స్పందిస్తూ... రాజకీయాల్లోకి ప్రవేశిస్తున్న మహిళలు తక్కువగా వున్నందునే ఈ సమస్య వస్తోందన్నారు. మహిళలు మరింత చురుకుగా రాజకీయాల్లోకి వస్తే పురుషులతో సమానస్థాయి దక్కుతుందనీ, భవిష్యత్తులో అది సాకారమవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
 
కండ బలాన్ని చూపేందుకే బ్యాలెట్ పేపర్లంటున్నారు... కృష్ణమూర్తి
మాజీ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ టి.ఎస్ కృష్ణమూర్తి మాట్లాడుతూ... ఈవీఎం మిషన్లు తీసేసి బ్యాలెట్ పేపర్ల పద్ధతి రావాలంటూ కొన్ని రాజకీయ పార్టీలు డిమాండ్ చేయడాన్ని తప్పుపట్టారు. అలాంటి పార్టీలు తమ కండబలాన్ని ఉపయోగించి రిగ్గింగులకు పాల్పడటం ద్వారా బోగస్ ఓట్లను వేసుకునేందుకే ఇలా వాదిస్తున్నారంటూ చెప్పారు. ఇకపోతే రాజకీయ పార్టీలు ఓటర్లకు డబ్బు వెదజల్లడం వంటి కార్యకలాపాలను ఎదుర్కొనేందుకు కఠినమైన చట్టాలను తీసుకురావాల్సిన ఆవశ్యకత వుందన్నారు. అంతేకాదు... కార్పొరేట్ సంస్థలు ఆయా రాజకీయ పార్టీలకు నిధులు సమకూర్చడాన్ని తప్పుపట్టారు.