గురువారం, 28 మార్చి 2024
  1. వార్తలు
  2. ఎన్నికలు 2019
  3. లోక్ సభ ఎన్నికలు 2019 వార్తలు
Written By

యూపీఏ-3 సర్కారుకు కాంగ్రెస్ పావులు...

ఈ నెల 23వ తేదీన సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెల్లడికానున్నాయి. ఈ ఫలితాల్లో ఏ ఒక్క పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాదని ప్రతి ఒక్కరూ అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా, అధికార బీజేపీ గణనీయమైన సీట్లన కోల్పోతుందని చెబుతున్నారు. అదేసయంలో కాంగ్రెస్ పార్టీ మాత్రం తిరిగి యూపీఏ ప్రభుత్వం వస్తుందన్న నమ్మకంలో ఉంది. 
 
దీంతో ఎన్డీయేతర పార్టీలను ఏకతాటిపైకి తెచ్చి యూపీఏ-3 ఏర్పాటు చేయాలని కాంగ్రెస్‌ ప్రయత్నాలు ప్రారంభించింది. అనారోగ్యంతో ఉన్నా కూడా యూపీఏ ఛైర్‌పర్సన్‌ సోనియాగాంధీ శనివారం కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలతో ఢిల్లీలోని తన నివాసంలో సమావేశం నిర్వహించారు. 
 
కాంగ్రెస్‌ నేతృత్వాన కేంద్రంలో మళ్లీ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అనుసరించాల్సిన వ్యూహాలపై విస్తృతంగా చర్చించారు. వచ్చేది హంగ్‌ పార్లమెంటే అని అభిప్రాయానికి వచ్చిన కాంగ్రెస్‌ నాయకులు మోడీని మళ్లీ ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రధాని పీఠంపై కూర్చోనీయకూడదనే కృతనిశ్చయంతో ఉన్నట్లు తెలుస్తోంది. 
 
సోనియాగాంధీ అధ్యక్షతన జరిగిన సమావేశంలో కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్‌, పార్టీ సీనియర్‌ నేతలు అహ్మద్‌పటేల్‌, ఎ.కె.ఆంటోనీ తదితరులు పాల్గొన్నట్లు కాంగ్రెస్‌వర్గాలు తెలిపాయి. ప్రభుత్వ ఏర్పాటుకు  ఏ ఒక్క అవకాశాన్నీ వదులుకోకూడదని నిర్ణయం తీసుకున్నారు.
 
ఇదిలావుంటే, ఎన్నికల ఫలితాలకు ఒక్కరోజు ముందు మే 22న సీనియర్‌ పార్టీ నాయకులతో సమావేశం కావాలని రాహుల్‌ గాంధీ నిర్ణయించారు. ప్రభుత్వ ఏర్పాటుకు అనుసరించాల్సిన వ్యూహాలు, పార్టీపరంగా సర్దుబాట్లుపై చర్చించడానికే ఈ సమావేశం నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. 
 
యూపీఏ-3 ఏర్పాటులో భాగంగా ఇప్పటికే కొన్ని ఎన్డీయేతర పార్టీ నాయకులతో కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలు సంప్రదింపులు ప్రారంభించారు. ఇందులోభాగంగానే శనివారం తెదేపా అధ్యక్షుడు చంద్రబాబును రాహుల్‌ గాంధీ కలిశారు. ఇతర పార్టీ నాయకులతో సంప్రదింపులు జరపాలని పటేల్‌, అశోక్‌ గెహ్లోట్‌, కమల్‌నాథ్‌, పి.చిదంబరంలను ఇప్పటికే రాహుల్‌ పురమాయించారు. ఈ నేపథ్యంలో వీరు ఢిల్లీలో మకాం వేసి, వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. మొత్తంమీద మోడీకి చెక్ పెట్టి కేంద్రంలో యూపీఏ 3 ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలన్న కృతనిశ్చయంతో సోనియా పావులు కదుపుతున్నారు.