గురువారం, 4 జులై 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వరుణ్

గాల్లో ఊగిపోయిన విమానం... గాల్లో దీపంలా ప్రయాణికుల ప్రాణాలు...

air turbolance
గగనతలంలో విమానాలు కుదుపులకు గురయ్యే సంఘటనలు ఇటీవలి కాలంలో తరచుగా జరుగుతున్నాయి. తాజాగా మరో ఎయిర్ టర్బులెన్స్‌ ఘటన జరిగింది. దీంతో ఆ విమానంలో ప్రయాణిస్తూ వచ్చిన 325 మంది ప్రయాణికుల ప్రాణాలు గాల్లో దీపంలా కొట్టుమిట్టాడాయి. ప్రయాణికులు తమ ప్రాణాలను అరచేతిలో పెట్టుకోవడంతో ఆ విమామాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. మాడ్రిడ్ నుంచి మాంటెవీడియో వెళ్తున్న ఎయిర్ యూరోపా విమానం భారీ కుదులుపులకు గురైంది. దీంతో విమానాన్ని బ్రెజిల్‌లో అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు.
 
బోయింగ్ 787-9 డ్రీమ్ లైనర్ విమానమైన ఇందులో 325 మంది ప్రయాణికులున్నారు. గాలిలో ఒక్కసారిగా కుదుపులకు గురై ఊగిపోవడంతో ప్రయాణికులు హాహాకారాలు చేశారు. వస్తువులన్నీ చెల్లాచెదురుగా పడ్డాయి. దీంతో ఏమాత్రం ఆలస్యం చేయకుండా విమానాన్ని ఈశాన్య బ్రెజిల్‌లోని నాటల్ విమానాశ్రయానికి మళ్లించి సురక్షితంగా ల్యాండ్ చేశారు. అప్పటికే అక్కడ డజన్ల కొద్దీ అంబులెన్స్ రెడీగా ఉన్నాయి.
 
కుదుపుల కారణంగా తీవ్రంగా గాయపడిన 40 మంది ప్రయాణికులను ఆసుపత్రికి తరలించారు. స్వల్పంగా గాయపడిన వారిని చికిత్స అనంతరం పంపించగా, తీవ్రంగా గాయపడినవారు ఇంకా ఆసుపత్రిలోనే ఉన్నారు. గాయపడిన వారిలో స్పెయిన్, అర్జెంటినా, ఉరుగ్వే, ఇజ్రాయెల్, బొలీవియా, జర్మనీ దేశాలకు చెందినవారున్నారు.
 
ఈ యేడాది మే నెలలో సింగపూర్ ఎయిర్ లైన్స్ విమానం కూడా ఇలాగే ఎయిర్ టర్బులెన్స్‌కు గురైంది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన 73 ఏళ్ల బ్రిటిష్ జాతీయుడు మరణించాడు. ఆ తర్వాత వారానికే దోహా నుంచి ఐర్లాండ్ వెళ్తున్న ఖతార్ ఎయిర్వేస్ విమానం కూడా ఇలానే కుదుపులకు గురికావడంతో 12 మంది ప్రయాణికులు గాయపడ్డారు. ఎయిర్ టర్బులెన్స్‌కు వాతావరణ మార్పులే కారణమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.