1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వరుణ్
Last Updated : శుక్రవారం, 28 జూన్ 2024 (11:19 IST)

కుప్పకూలిన ఢిల్లీ ఎయిర్‌పోర్టు రూఫ్.. ముగ్గురి మృతి.. కార్లు నుజ్జునుజ్జు

roof collapse
దేశ రాజధాని ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఘోర ప్రమాదం జరిగింది. గురువారం రాత్రి నుంచి శుక్రవారం తెల్లవారుజాము వరకు భారీ ఈదురు గాలులతో కురిసిన వర్షానికి ఎయిర్‌పోర్టు రూఫ్ కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా, మరికొందరు గాయపడ్డారు. రూఫ్ కూలిపోవడంతో దానికింద పార్కింగ్ చేసివున్న కార్లు నుజ్జునుజ్జు అయ్యాయి. ఈ ఘటన టెర్మినల్ 1డి వద్ద జరిగింది. ఈ ఘటనతో చెక్ ఇన్ కౌంటర్లను మూసివేశారు. విమానాశ్రయం చుట్టూ పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. అలాగే, అక్కడ నుంచి వెళ్లాల్సిన విమానాలను మధ్యాహ్నం ఒంటిగంటవరకు రద్దు చేశారు. 
 
రూఫ్ షీట్‌తో పాటు దానికి సపోర్డుగా ఉన్న పిల్లర్లు ఒక్కసారిగా శుక్రవారం తెల్లవారుజామున కుప్పకూలాయి. దీంతో డిపార్చల్ లైన్ వద్ద పార్క్ చేసిన కార్లు నుజ్జు నుజ్జు అయ్యాయి. ఈ ఘటనను తాను వ్యక్తిగతంగా పర్యవేక్షిస్తున్నట్టు కేంద్ర పౌర విమానయాన మంత్రి కె.రామ్మోహన్ నాయుడు తెలిపారు. గురువారం రాత్రి నుంచి శుక్రవారం ఉదయం వరకు కురిసిన భారీ వర్షానికి ఢిల్లీ రహదారులు చిన్నపాటి కాల్వలను తలపిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని ట్రాఫిక్ పోలీసులు హెచ్చరికలు చేశారు.