శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : గురువారం, 8 ఆగస్టు 2019 (10:30 IST)

శత్రుచెరలోనూ అసమాన్య ధైర్యసాహసాలు... అభినందన్‌కు "వీర్ చక్ర"

పుల్వామా ఉగ్రదాడి తర్వాత పాకిస్థాన్ యుద్ధ విమానాలను తరిమికొట్టే సమయంలో భారత వాయుసేన సత్తాను ప్రపంచ దేశాలకు చాటిచెప్పిన అభినందన్ వర్ధమాన్‌ను కేంద్రం సముచిత రీతిలో సత్కరించనుంది. ఇందులోభాగంగా ఆయనకు వీర్ చక్ర పురస్కార్‌ను ప్రదానం చేయనుంది. 
 
పుర్వామా ఉగ్రదాడి తర్వాత భారత్ పీవోకేలోని బాలాకోట్‌లో సర్జికల్ స్ట్రైక్ చేపట్టి పాక్ ప్రేరేపిత ఉగ్రతండాలను ధ్వంసం చేసింది. ఈ దాడుల తర్వాత భారత్‌లోని వైమానిక స్థావరాలపై దాడులు చేసేందుకు వచ్చిన రెండు పాకిస్థాన్ యుద్ధ విమానాలను భారత వాయుసేన తరిమికొట్టింది. ఇందులో ఒకగాన్ని అభినందన్ వర్ధమాన్ నడిపాడు. అయితే, పాకిస్థాన్ యుద్ధ విమానాన్ని కూల్చివేసే సమయంలో ఈయన ప్రయాణిస్తున్న మిగ్ విమానం కూలిపోయింది. ప్యారాచూట్ సాయంతో పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో సురక్షితంగా దిగినప్పటికీ.. పాకిస్థాన శత్రుసైన్యానికి పట్టుబడ్డాడు. 
 
అయినప్పటికీ మొక్కవోని దైర్యసాహసాలను ప్రదర్శించాడు. అంతేకాకుండా, భారత్ వాయుసేన సత్తాను ప్రపంచానికి చాటిచెప్పాడు. దీంతో ఆయనకు వీర్ చక్ర పురస్కారాన్ని ప్రదానం చేయనున్నట్టు తెలుస్తోంది. సైన్యానికి సంబంధించిన పరమ్ వీర్ చక్ర, మహావీర్ చక్ర తర్వాత అది మూడో అత్యున్నత పురస్కారం కావడం గమనార్హం. 
 
పాకిస్థాన్ సైన్యం చేతిలో బందీగా ఉన్న సమయంలో కూడా అభినందన్ ఏ మాత్రం ధైర్యాన్ని కోల్పోలేదు. పాక్ సైన్యం ఎంత బలవంతం చేసినా, మన మిలిటరీకి సంబంధించిన సమాచారాన్ని బయటపెట్టలేదు. దీనికి సంబంధించిన వీడియోలు ప్రపంచ వ్యాప్తంగా వైరల్ అయిన సంగతి తెలిసిందే. అభినందన్ ధైర్యసాహసాలకు, దేశ భక్తికి యావత్ దేశం మురిసిపోయిన విషయం తెల్సిందే.