ఎర్రకోట కారు బాంబు పేలుడు కేసు : దర్యాప్తులో విస్తుపోయే నిజాలు.... ఏంటవి?
ఢిల్లీ ఎర్రకోట వద్ద జరిగిన కారు బాంబు పేలుడు కేసు దర్యాప్తు ముందుకు సాగే కొద్దీ విస్తుపోయే నిజాలు వెలుగు చూస్తున్నాయి. నిందితులు పేలుడు పదార్థాలు, బాంబులను తయారు చేసేందుకు అనుసరించిన విధానాలను చూస్తుంటే ఆశ్చర్యం కలుగుతోంది. తాజాగా పేలుడు పదార్థాలను తయారు చేయడానికి పిండి మరను ఉపయోగించినట్లు విచారణలో తేలింది.
ప్రధాన నిందితుల్లో ఒకడైన ముజమ్మిల్ షకీల్ పిండి మర సాయంతో యూరియాను గ్రైండ్ చేసినట్లు గుర్తించారు. అలాగే, కొన్ని ఎలక్ట్రికల్ మెషీన్లను కూడా వాడినట్లు వెల్లడైంది. వీటన్నింటినీ దర్యాప్తు అధికారులు హర్యానా ఫరీదాబాద్లో ఉన్న ట్యాక్సీ డ్రైవర్ ఇంటి నుంచి సేకరించారు. అద్దెకు తీసుకున్న ఆ ఇంట్లోనే అతడు దాన్ని ఉపయోగించినట్లు తెలిసింది. గతంలో అక్కడే 360 కిలోల అమ్మోనియం నైట్రేట్ లభ్యమైన విషయం తెలిసిందే.
యూరియాను పిండి మరలో మెత్తగా రుబ్బి.. దాన్ని ఎలక్ట్రికల్ మెషీన్లతో రిఫైన్ చేసేవాడని విచారణలో వెల్లడైంది. వాటి నుంచి బాంబులకు కావాల్సిన కెమికల్స్ను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. మరోవైపు అధికారులు ట్యాక్సీ డ్రైవర్ను కూడా అదుపులోకి తీసుకున్నారు. తన కొడుకును అల్-ఫలాహ్ మెడికల్ కాలేజ్కు ట్రీట్మెంట్ కోసం తీసుకెళ్లినప్పుడు మొదటిసారి ముజమ్మిల్ను కలిసినట్లు విచారణలో వెల్లడించాడు.
ఢిల్లీలోని ఎర్రకోట వద్ద జరిగిన కారు బాంబు పేలుడులో 15 మంది మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో అనేక మంది గాయపడ్డారు. ఉగ్రవాది డాక్టర్ ఉమర్ ఉన్ నబీ.. హ్యుందాయ్ ఐ20 కారులో ఆత్మాహుతి చేసుకొని ఈ దారుణానికి ఒడిగట్టాడు. ఈ కేసులో ఇప్పటికే పలువురిని అదుపులోకి తీసుకున్నారు. దీంట్లో అల్-ఫలాహ్ వర్సిటీకి చెందిన చాలా మంది డాక్టర్లకు సంబంధాలు ఉన్నట్లు గుర్తించారు. దీంతో ఈ వర్శిటీ గుర్తింపును అఖిల భారత విశ్వవిద్యాలయాల అసోసియేషన్ రద్దుచేసింది.