శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వరుణ్
Last Updated : బుధవారం, 4 జనవరి 2023 (10:34 IST)

తమిళనాడు బీజేపీలో మహిళలకు గౌరవం లేదు : నటి గాయత్రి రఘురాం

gayathri raghuram
భారతీయ జనతా పార్టీ తమిళనాడు శాఖకు సినీ నటి గాయత్రీ రఘురాం టాటా చెప్పేశారు. ఆ పార్టీ తమిళనాడు శాఖ అధ్యక్షుడు, మాజీ ఐపీఎస్ అధికారి కె.అన్నామలై తీరు నచ్చకే తాను రాజీనామా చేస్తున్నట్టు ఆమె ప్రకటించారు. తమిళనాడు బీజేపీ శాఖలో మహిళలకు ఏమాత్రం గౌరవం లేదని, సమాన హక్కులు లేవని ఆమె ధ్వజమెత్తారు. 
 
గత 2014లో బీజేపీలో చేరిన గాయత్రి రఘురాం తన మాటల ద్వారా తమిళనాట రాజకీయాల్లో మంచి గుర్తింపు పొందారు. ప్రస్తుతం ఆమె ఆ పార్టీ సాంస్కృతిక విభాగం అధ్యక్షురాలిగా పని చేస్తున్నారు. అయితే, గత కొంతకాలంగా పార్టీ అధ్యక్షుడు అన్నామలైకు ఆమెకు ఏమాత్రం పొసగడం లేదు. దీంతో పార్టీకి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా ఆయనపై ఆమె సంచలన ఆరోపణలు చేశారు. 
 
బీజేపీలో మహిళలకు సమాన హక్కులు, గౌరవం లేవని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ట్వీట్ చేశారు. అన్నామలై వ్యవహారశైలి ఏమాత్రం బాగోలేదన్నారు. తనతో కలిసి 8 యేళ్లపాటు కలిసి పని చేసిన కార్యకర్తలకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. పైగా, గౌరవం లేని చోట ఉండొద్దని వారికి ఆమె విజ్ఞప్తి చేశారు.
 
కాగా, తెలుగులో 'రేపల్లెలో రాధ', 'మా బాపు బొమ్మకు పెళ్లంట', 'లవ్ ఫెయిల్యూర్' వంటి చిత్రాలతో తెలుకు ప్రేక్షకులకు దగ్గరైన ఈ తమిళ నటి... తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో కలిపి దాదాపు 10 చిత్రాలకు పైగా నటించారు. పైగా, ఈమె మంచి కొరియోగ్రాఫర్ కూడా. ఈమె తెలుగులో చివరిసారిగా 'రంగ్ దే' అనే చిత్రంలో నితిన్ సోదరిగా కనిపించారు.