శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By జె
Last Modified: బుధవారం, 26 ఫిబ్రవరి 2020 (19:29 IST)

ప్రియుడితో తనను చూసిందని అత్తను హత్య చేసిన కోడలు

వివాహేతర సంబంధాల మోజులో కుటుంబాలు విచ్ఛిన్నమైపోతున్నాయి. భర్త కళ్లుగప్పి ప్రియుడితో రొమాన్స్ చేస్తున్న భార్య బాగోతం ఆమె అత్త కంటపడటంతో దారుణానికి ఒడిగట్టింది. రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోవడంతో అత్తను అతి కిరాతకంగా హత్య చేసి ఏమీ ఎరగనట్టు నటించింది. భర్తకి ఫోన్ చేసి లబోదిబోమంది. పోలీసులు సీన్‌లోకి రావడంతో అసలు విషయం బయటపడింది. ఈ ఘటన కర్ణాటక రాజధాని బెంగళూరులో చోటుచేసుకుంది. 
 
నగరంలోని బ్యాటరాయనపుర మెయిన్ రోడ్డులో కుమార్, సౌందర్య దంపతులు నివసిస్తున్నారు. కుమార్ తల్లి రాజమ్మ కొడుకుతో పాటే ఉంటోంది. రాజమ్మ నిన్న రక్తపు మడుగులో శవమై కనిపించింది. కంగారుపడిన కోడలు భర్తకి ఫోన్ చేసింది. ప్రైవేట్ మార్కెటింగ్ సంస్థలో పనిచేసే కుమార్ బిజీగా ఉండటంతో ఫోన్ లిఫ్ట్ చేయలేదు. అతని భార్య సౌందర్య ఇంటి యజమానికి ఫోన్ చేయడంతో ఆయన ఇంటి వద్దకు వచ్చి కుమార్‌కి మరోమారు ఫోన్ చేసి విషయం చెప్పాడు. తల్లి హత్య విషయం విన్న కుమార్ వెంటనే ఇంటికొచ్చేశాడు. 
 
ఆమె మెడలో బంగారు ఆభరణాలు కనిపించకుండా పోయినట్లు గుర్తించారు. ఎవరైనా దొంగలు బంగారం కోసం చంపేసి ఉంటారని అనుమానించారు. ఆ సమయంలో కోడలు సౌందర్య సమీపంలోని బంధువుల ఇంటికి వెళ్లానని.. గంట తర్వాత వచ్చి చూస్తే చనిపోయి పడి ఉందని భోరుమంది. పోలీసులకు సమాచారం అందించడంతో సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఇనుప రాడ్డుతో కొట్టడంతో చనిపోయినట్లు గుర్తించారు. 
 
అయితే ఆమెను హత్య చేయాల్సిన అవసరం ఎవరికొచ్చిందన్న కోణంలో దర్యాప్తు ప్రారంభించారు. ఇంటి దొంగల పనిగా భావించిన పోలీసులు కోడలు సౌందర్యను అనుమానించారు. ఆమెను తీసుకెళ్లి విచారించడంతో షాకింగ్ నిజాలు వెల్లడయ్యాయి. రాజమ్మకు తమలపాకు వేసుకునే అలవాటు ఉంది. కొద్దికాలంగా ఆ ఏరియాలో లైన్‌ మ్యాన్‌గా పని చేస్తున్న నవీన్ జడేస్వామి అనే వ్యక్తి తరచూ రాజమ్మ వద్దకు వచ్చేవాడు. 
 
తమలపాకులు అడిగి తీసుకుని వేసుకునేవాడు. ఈ క్రమంలో నెమ్మదిగా కోడలు సౌందర్యతో సాన్నిహిత్యం పెరిగింది. ఇద్దరూ అక్రమ సంబంధం పెట్టుకున్నారు. భర్త కుమార్ ఆఫీస్‌కి వెళ్లిన సమయంలో తమలపాకుల సాకుతో ప్రియుడు నవీన్ ఇంటికి వచ్చేవాడు. కోడలు సౌందర్యతో బెడ్రూమ్‌లో రాసలీలలు సాగించేవాడు. ఓ రోజు ఇద్దరూ ఏకాంతంగా ఉన్న సమయంలో సడెన్‌గా అత్త రాజమ్మ ఇంట్లోకి వచ్చింది. వాళ్లిద్దరినీ అలా చూసిన రాజమ్మ.. కోడలిని తీవ్రంగా హెచ్చిరించింది.
 
కొడుక్కి చెప్పి పంచాయితీ పెడతానని బెదిరించడంతో భయపడిపోయిన కోడలు దారుణానికి ఒడిగట్టింది. భర్తకి చెబుతుందన్న భయంతో అత్తను చంపేయాలని నిర్ణయించుకుంది. ప్రియుడితో కలసి మాస్టర్ ప్లాన్ వేసింది. ప్రియుడితో కలసి అత్తని ఇనుప రాడ్డుతో విచక్షణా రహితంగా కొట్టి అతి కిరాతకంగా చంపేసింది. రక్తపు మడుగులో పడి ఉన్న రాజమ్మను అక్కడే వదిలేసి ఏమీ ఎరగనట్టు బంధువుల ఇంటికి వెళ్లింది. 
 
ప్రియుడు అక్కడి నుంచి పారిపోయాడు. గంట తరువాత వచ్చిన కోడలు హైడ్రామాకు తెరతీసింది. ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు అత్తను చంపేశారంటూ లబోదిబోమంది. హత్య కేసు నమోదు చేసుకున్న బ్యాటరాయనపుర పోలీసులు ఇంట్లో వారి కదలికలపై నిఘా పెట్టారు. ఎవరెవరు ఇంట్లో ఉంటారు? ఎవరెవరు వచ్చి వెళ్తుంటారని ఆరా తీయడంతో లైన్ మ్యాన్ నవీన్ పేరు అనుమానంగా అనిపించింది. కోడలితో ఆమెకు ఎఫైర్ ఉందన్న కోణంలో దర్యాప్తు చేయడంతో నిజాలు వెలుగులోకి వచ్చాయి. కోడలు సౌందర్యతో సహా ఆమె ప్రియుడు నవీన్‌ను పోలీసులు అరెస్టు చేసి జైలుకి పంపారు.