శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : బుధవారం, 19 సెప్టెంబరు 2018 (14:29 IST)

ఎడప్పాడికి అగ్నిపరీక్ష : ఎమ్మెల్యేలకు అనుకూలమా.. వ్యతిరేకమా? ఎలా వచ్చినా ముప్పే

చెన్నై ఆర్.కె.నగర్ ఎమ్మెల్యే, అమ్మా మక్కల్ మున్నేట్ర కళగం ఉపప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్ వర్గానికి చెందిన 18 మంది ఎమ్మెల్యేల అనర్హత కేసులో తుది తీర్పు గురువారం వెలువడే అవకాశం ఉంది.

చెన్నై ఆర్.కె.నగర్ ఎమ్మెల్యే, అమ్మా మక్కల్ మున్నేట్ర కళగం ఉపప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్ వర్గానికి చెందిన 18 మంది ఎమ్మెల్యేల అనర్హత కేసులో తుది తీర్పు గురువారం వెలువడే అవకాశం ఉంది. ఇందులో తుది తీర్పు ఎమ్మెల్యేలకు అనుకూలంగా వచ్చినా, వ్యతిరేకంగా వచ్చినా ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి ప్రభుత్వానికి గండంగా మారనుంది.
 
ఈ నేపథ్యంలో అసెంబ్లీ స్పీకర్ ధనపాల్‌తో ముఖ్యమంత్రి ఎడప్పాడి కె.పళనిస్వామి సమావేశమయ్యారు. అసెంబ్లీ ప్రాంగణంలో ఉన్న స్పీకర్‌ ఛాంబర్‌కెళ్లిన సీఎం.. అక్కడ గంటపాటు మంతనాలు జరిపినట్టు సమాచారం. మూడో న్యాయమూర్తి ఇప్పుడు ఏం చెబితే అదే హైకోర్టు తుదితీర్పు అవుతుంది గనుక దానిపై ఏం చేయాలన్నదానిపై సీఎం, స్పీకర్‌, సీనియర్‌ మంత్రులు చర్చించినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. 
 
ఈ కేసులో కోర్టు తీర్పు 18 మంది ఎమ్మెల్యేలకు అనుకూలంగా వస్తే.. ఎడప్పాడి ప్రభుత్వం అసెంబ్లీలో బలపరీక్ష ఎదుర్కోవాల్సివస్తుంది. ఒకవేళ ఆ ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా వస్తే.. మరో ఆరు నెలల్లో ఉప ఎన్నికలు రావడం ఖాయం. అప్పుడు జరిగే ఎన్నికల్లో ఎలాంటి ఫలితం వస్తుందోనన్నది అన్నాడీఎంకే ఆందోళన. ఒకవేళ ఆ ఎన్నికల్లో తమకు వ్యతిరేక ఫలితాలు వెల్లడైతే.. అప్పుడైనా ప్రభుత్వం గడ్డుపరిస్థితి ఎదుర్కోవాల్సివుంటుంది. 
 
అది కూడా ప్రభుత్వానికి అగ్నిపరీక్షే. అందువల్ల ఏం చేయాలన్నదానిపై సీఎం, స్పీకర్‌ చర్చించినట్టు తెలిసింది. అయితే హైకోర్టులో తమకు వ్యతిరేకంగా తీర్పు వస్తే సుప్రీంకోర్టును ఆశ్రయించాలని సీఎం బృందం భావిస్తున్నట్టు తెలిసింది. అదే సమయంలో టీటీవీ దినకరన్‌ వర్గం కూడా తమకు వ్యతిరేకంగా తీర్పు వస్తే సుప్రీంకోర్టుకెళ్లాలని నిర్ణయించినట్టు తెలిసింది. ఏది ఏమైనప్పటికీ హైకోర్టు తీర్పు రాజకీయవర్గాల్లో ప్రకంపనలు పుట్టించడం ఖాయంగా కనిపిస్తోంది.