బుధవారం, 12 మార్చి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 12 మార్చి 2025 (13:00 IST)

తమిళనాడు ప్రభుత్వ ఉద్యోగులకు మాతృభాష తప్పనిసరి : మద్రాస్ హైకోర్టు

madras highcourt
తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు మాతృభాష తమిళం తప్పనిసరి అని మద్రాస్ హైకోర్టు మదురై బెంచ్ స్పష్టం చేసింది. మాతృభాష అయిన తమిళం రాకపోతే ప్రభుత్వ ఉద్యోగులు తమ విధులను సమర్థవంతంగా నిర్వహించలేరని కోర్టు అభిప్రాయపడింది. ఎల్లవేళలా ప్రజల మధ్య ఉండి పని చేయాల్సిన ప్రభుత్వ ఉద్యోగులకు తమిళం తెలియకపోతే ఎలా అని ప్రశ్నించింది. 
 
ఎం. జయకుమార్ అనే వ్యక్తి మద్రాస్ హైకోర్టులో ఓ పిటిషన్ దాఖలు చేశారు. తమిళ భాషలో నిర్వహించిన పరీక్షలో విఫలమైనందుకు తనను తమిళనాడు విద్యుత్ శాఖ (టీఎన్ఈబీ)లో ఉద్యోగం నుంచి ప్రభుత్వం తొలగించిందని పేర్కొన్నాడు. తన తండ్రి నావికాదళంలో పని చేస్తుండటంతో తాను సీబీఎస్ఈ పాఠశాలలో చదివానని, అందువల్ల తమిళం నేర్చుకోవడానికి వీలుపడలేదని పేర్కొన్నారు. దీనిని విచారణకు స్వీకరించిన కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.
 
తమిళనాడు రాష్ట్రంలో ఉద్యోగాల కోసం ప్రయత్నించే అభ్యర్థులు తప్పనిసరిగా తమిళం రాయడం, చదవడం నేర్చుకోవాలని మదురై బెంచ్ స్పష్టం చేసింది. ఎల్లపుడూ ప్రజల మధ్య ఉండి పని చేయాల్సిన ప్రభుత్వ ఉద్యోగులకు మాతృభాష అయిన తమిళం తెలియకపోతే రోజువారీ విధులను ఎలా నిర్వహిస్తారని ప్రశ్నించింది. ఏ రాష్ట్రంలో అయినా ప్రభుత్వ ఉద్యోగులకు రాష్ట్ర భాష వచ్చి ఉండాలని లేకపోతే వారు తమ విధులను సమర్థవంతంగా నిర్వహించలేరని ధర్మాసనం అభిప్రాయడుతూ ఈ కేసును ఆరు నెలలకు వాయిదా వేసింది.
 
కాగా, రాష్ట్రంలో త్రిభాషా విధానంపై మాటల యుద్ధం కొనసాగుతున్న తరుణంలో హైకోర్టు చేసిన వ్యాఖ్యలకు అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. జాతీయ విద్యా విధానంలో త్రిభాష సూత్రంలో భాగంగా దేశ వ్యాప్తంగా విద్యార్థులు, ఇంగ్లీష్, హిందీతో పాటు ఒక స్థానిక భాషను నేర్చుకోవాలన్నది కేంద్రం వాదన. అయితే, తాము మాత్రం ద్విభాషా సూత్రానికే కట్టుబడివుంటామని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ స్పష్టం చేశారు. దీంతో ఇటు రాష్ట్రం, అటు కేంద్రం ప్రభుత్వం మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది.