Vande Mataram: వందేమాతరం 150వ వార్షికోత్సవం.. అమిత్ షా, పవన్ కల్యాణ్ ఏమన్నారంటే?
వందేమాతరం కేవలం పదాల సమాహారం కాదు, అది భారతదేశ ఆత్మ స్వరం అని, ఈ ఐకానిక్ జాతీయ గీతం 150వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. భారతదేశ స్వాతంత్ర్య పోరాటంలో దేశాన్ని ఏకం చేయడంలో ఈ పాట చారిత్రాత్మక పాత్ర పోషించిందని, నేటికీ యువతలో గర్వం, దేశభక్తిని ప్రేరేపిస్తుందని అమిత్ షా ఎక్స్లో ఒక పోస్ట్లో అన్నారు.
ఆంగ్ల పాలనకు వ్యతిరేకంగా, వందేమాతరం దేశాన్ని ఏకం చేసి స్వేచ్ఛా చైతన్యాన్ని బలోపేతం చేసింది. అదే సమయంలో, ఇది విప్లవకారులలో మాతృభూమి కోసం అచంచలమైన అంకితభావం, గర్వం, త్యాగస్ఫూర్తిని మేల్కొలిపిందని అమిత్ షా రాసుకొచ్చారు.
ఈ పాట దేశప్రజల హృదయాలలో జాతీయవాదం శాశ్వత జ్వాలను రగిలిస్తూ ఉందని, అలాంటి ఈ ప్రత్యేకమైన జాతీయ గీతం వందేమాతరం ఈ సంవత్సరం 150 సంవత్సరాలు పూర్తి చేసుకుంటోంది.. అని అమిత్ షా అన్నారు.
ఈ సందర్భాన్ని స్మరించుకోవాలని పౌరులకు పిలుపునిస్తూ, వారి కుటుంబాలతో కలిసి ఈ పాటను పూర్తిగా పాడాలని అమిత్ షా కోరారు. వందేమాతరం 150వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని, దాని చారిత్రక, సాంస్కృతిక ప్రాముఖ్యతను జరుపుకునేందుకు ఢిల్లీ అసెంబ్లీ శుక్రవారం ఒక గొప్ప కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఇంకా ప్రముఖులు వందేమాతరం పాట 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా రకరకాల అభిప్రాయాలను సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నారు.
ఇదే తరహాలో భారత స్వాతంత్య్ర సంగ్రామంలో యావత్ దేశాన్ని ఏకతాటిపై నడిపించిన వందేమాతరం గేయం స్ఫూర్తిని భావితరాలకు అందించాల్సిన బాధ్యత మనందరిపై ఉందని జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. ఈ చారిత్రక గేయం రచించి శుక్రవారంతో 150 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరూ దీనిని ఆలపించాలని ఆయన పిలుపునిచ్చారు.