మంగళవారం, 2 జులై 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వరుణ్
Last Updated : సోమవారం, 15 జనవరి 2024 (19:31 IST)

ప్రధాని నరేంద్ర మోడీకి రామమందిర ఆహ్వానం...

narendra modi
అయోధ్యలో రామమందిరంలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠ కోసం ఏర్పాట్లు శరవేగంగాసాగుతున్నాయి. ఇప్పటికే నగరం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడీకి ఆహ్వానం అందింది. దీనిపై ఆయన స్పందించారు. ఈ కార్యక్రమానికి తనను ఆహ్వానించడం అదృష్టంగా భావిస్తున్నట్లు చెప్పారు. 
 
సోమవారం ‘ప్రధానమంత్రి జన్‌జాతి ఆదివాసీ న్యాయ్‌ మహా అభియాన్‌’ పథకం నిధుల విడుదల కార్యక్రమంలో ఆయన వర్చువల్‌గా పాల్గొన్నారు. ఈ సందర్భంగా లబ్ధిదారులను ఉద్దేశించి ప్రసంగించారు. 'అయోధ్యలో గొప్పగా నిర్మించిన ఆలయంలో జనవరి 22న శ్రీరాముడు మనకు దర్శనం ఇవ్వనున్నాడు. ఈ మహోన్నత కార్యక్రమానికి ఆహ్వానం అందడం నా అదృష్టం. ఇప్పటికే నేను 11 రోజుల అనుష్ఠాన దీక్ష చేస్తున్నా. మాత శబరి లేకుండా శ్రీరాముని కథ అసంపూర్ణం’ అని మోడీ తెలిపారు.
 
జనవరి 22న మధ్యాహ్నాం 12:20 గంటలకు ప్రాణప్రతిష్ఠ జరుగుతుందని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు ప్రధాన కార్యదర్శి చంపత్‌ రాయ్‌ తెలిపారు. ఆ రోజు శ్రీరాముడి విగ్రహాన్ని ప్రధాని స్వయంగా గర్భగుడిలోకి తీసుకురానున్నారు. పూజ మండపం నుంచి గర్భగుడికి 25 సెకన్లలో చేరుకుంటారు. కాశీకి చెందిన పండిట్‌ లక్ష్మీకాంత్‌ దీక్షిత్‌ నేతృత్వంలో ఈ కార్యక్రమం జరగనుంది.  
 
దేశంలో అర్హులైన ప్రతి పౌరుడికి సంక్షేమ పథకాలు అందితేనే నిజమైన అభివృద్ధి జరుగుతుందన్నారు. మారుమూల ప్రాంతాల్లోని ప్రజలకు కూడా పథకాలను చేరవేస్తామని హామీ ఇచ్చారు. పీఎం జన్‌మన్‌ పథకం కింద రూ.540 కోట్ల నిధులను విడుదల చేశారు. దీని ద్వారా లక్ష మంది లబ్ధిదారులకు ప్రయోజనం చేకూరనుంది. గత పదేళ్లలో ఆదివాసీల సంక్షేమం కోసం ఖర్చు చేసే నిధులను ఐదు రెట్లు, స్కాలర్‌షిప్‌ల ద్వారా ఇచ్చే మొత్తాన్ని రెండున్నర రెట్లు పెంచామని ప్రధాని తెలిపారు.