గురువారం, 4 జులై 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 10 జనవరి 2024 (23:25 IST)

రామమందిరంలో తొలి బంగారు తలుపు.. 12 అడుగుల ఎత్తు... 8 అడుగుల వెడల్పు

Ayodhya
యావత్ భారతదేశం ఎదురుచూస్తున్న తరుణం మరికొద్ది రోజుల్లో రానుంది. ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న అయోధ్య రామమందిర నిర్మాణ పనులు పూర్తి కానున్నాయి. జనవరి 22న అయోధ్యలోని రామమందిరంలో రామ్ లల్లా విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమం జరగనుంది.
 
ప్రాణ ప్రతిష్ఠా కార్యక్రమానికి ముందు అయోధ్యలోని రామమందిరంలో తొలి బంగారు తలుపును ఏర్పాటు చేశారు. 12 అడుగుల ఎత్తు, 8 అడుగుల వెడల్పు ఉన్న ఈ తలుపుకు సంబంధించిన ఫోటోలను యూపీ సీఎంఓ కార్యాలయం విడుదల చేసింది. 
 
ఈ తలుపు మొదటి అంతస్థులో ఉంచబడింది. మరో మూడు రోజుల్లో మరో 13 బంగారు తలుపులు ఏర్పాటు చేయనున్నారు. రామమందిరంలో మొత్తం 46 ద్వారాలు ఉన్నాయి. అందులో 42 ద్వారాలకు 100 కిలోల బంగారంతో పూత పూస్తారు. మెట్ల దగ్గర ఉన్న నాలుగు తలుపులకు బంగారు పూత పూయలేదు.
 
గోల్డెన్ గేట్ తలుపు మధ్యలో రెండు ఏనుగులు నిర్మించబడ్డాయి. ఈ రెండు ఏనుగులు ప్రజలను స్వాగతిస్తున్నట్లు కనిపిస్తాయి. ఇవి కాకుండా ప్యాలెస్ లాంటి ఆకారం కనిపిస్తుంది. ఇక్కడ ఇద్దరు సేవకులు చేతులు పట్టుకుని కనిపిస్తారు. తలుపు దిగువ భాగంలో చతురస్రాకారంలో అందమైన కళాఖండాలు కూడా ఉన్నాయి. 
 
ఈ తలుపుల నిర్మాణం కోసం మహారాష్ట్ర నుంచి ప్రత్యేక కలపను తెప్పించారు. అవి దాదాపు వెయ్యి సంవత్సరాల వరకు చెక్కుచెదరకుండా ఉంటాయి. ఈ తలుపుల రూపకల్పనకు కన్యాకుమారి నుంచి కళాకారులు వచ్చారు. శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ జనవరి 16 నుంచి ధార్మిక కార్యక్రమాలు ప్రారంభించనుంది.