గురువారం, 4 జులై 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : గురువారం, 23 నవంబరు 2023 (10:34 IST)

26న తిరుమలకు వస్తున్న ప్రధాని నరేంద్ర మోడీ

pmmodi
ఈ నెల 26వ తేదీన ప్రధాని నరేంద్ర మోడీ తిరుమల శ్రీవారి దర్శనం కోసం వస్తున్నారు. ఆ రాత్రికి అక్కడే బస చేస్తారు. మరుసటి రోజున ఏకాంత సేవలో శ్రీవారిని దర్శనం చేసుకుని తిరిగి హస్తినకు బయలుదేరి వెళతారు. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన ఖరారైనట్టు తిరుపతి కలెక్టర్ కార్యాలయానికి సమాచారం వచ్చింది. 
 
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఆ రాష్ట్రంలో పర్యటిస్తూ ఎన్నికల ప్రచార సభల్లో ఆయన పాల్గొంటున్నారు. ఆదివారం సాయంత్రం 5.45 గంటలకు హైదరాబాద్ నగరంలోని దిండిగల్ ఎయిర్ ఫోర్స్ బేస్ నుంచి విమానంలో బయల్దేరి 6.50 గంటలకు రేణిగుంట విమానాశ్రయం చేరుకుంటారు. అక్కడ నుంచి రోడ్డుమార్గంలో బయల్దేరి రాత్రి 7.45 గంటలకు తిరుమల చేరుకుంటారు. కొండపై రచన అతిథి గృహంలో రాత్రికి బస చేస్తారు. సోమవారం ఉదయం 7.50 గంటలకు అతిథి గృహం నుంచి బయల్దేరి ఆలయంలోకి వెళ్లి శ్రీవారిని దర్శించుకుంటారు. 
 
సుమారు గంటపాటు ఆలయంలో గడుపుతారు. 8.50 గంటలకు ఆలయం నుంచి వెలుపలికి వచ్చి అతిథి గృహానికి చేరుకుంటారు. 3.30 గంటలకు తిరుగు ప్రయాణమై 10.20 గంటలకు రేణిగుంట విమానా శ్రయం చేరుకుని విమానంలో హైదరాబాద్ వెళతారు. ఈ మేరకు పర్యటన షెడ్యూలు అందడంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. 
 
ప్రధాని రాక సందర్భంగా భద్రతా ఏర్పాట్లు, తిరుమలలో బస, వాహనాల కాన్వాయ్ తదితర ఏర్పాట్లలో తలమునకలైంది. కాగా, ప్రధానిరాక సందర్భంగా ఆయనను విమానాశ్రయంలో స్వాగతించేందుకు ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ రానున్నట్టు తెలుస్తోంది. అధికారికంగా దీనిపై జిల్లా యంత్రాంగానికి ఎలాంటి సమాచారం లేనప్పటికీ స్వాగతించడం నుంచి తిరిగి వీడ్కోలు పలికే దాకా ప్రధాని వెంటే ఆయన ఉండే అవకాశముందని వైసీపీ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.