1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 27 సెప్టెంబరు 2021 (20:02 IST)

ప్రశాంతంగా భారత్​ బంద్... కండువాతో ఒక పైప్‌కు ఉరివేసుకున్న రైతు

Bharat bandh
దేశవ్యాప్తంగా భారత్​ బంద్ ప్రశాంతంగా ముగిసింది.​ తమ పోరాటానికి ఏడాది గడుస్తోన్న నేపథ్యంలో రైతు సంఘాలు భారత్ బంద్‌కు పిలుపునిచ్చాయి. బంద్​ ప్రభావం ఉత్తర భారతంలో ఎక్కువగా కనిపించింది. దిల్లీలో అనేక ప్రాంతాల్లో ట్రాఫిక్ స్తంభించింది. అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ట భద్రతను ఏర్పాటు చేశారు. ఎక్కడికక్కడ బ్యారికేడ్లు ఏర్పాటు చేసి తనిఖీలు చేపట్టారు. దిల్లీ- గురుగ్రామ్​ సరిహద్దుల్లో భారీగా వాహనాలు నిలిచిపోయాయి.
 
పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో రైతులు రైల్వే ట్రాక్​లపై బైఠాయించి తమ నిరసన తెలిపారు. పంజాబ్‌-హరియాణా సరిహద్దు ప్రాంతంలో జాతీయ రహదారిని రైతులు దిగ్భందించారు. హరియాణా రోహ్‌తక్‌, కర్నాల్‌ ప్రాంతాల్లోనూ ట్రక్కు, ద్విచక్ర వాహనాలను నిలిపి రాకపోకలను రైతన్నలు అడ్డుకున్నారు.దక్షిణ భారతంలో తమిళనాడు, కేరళలో బంద్ ప్రభావం ఎక్కువగా కనిపించింది. కర్ణాటకలో మాత్రం బంద్ పాక్షికంగా సాగింది.
 
మరోవైపు రైతుల 'భారత్‌ బంద్‌' నేపథ్యంలో పంజాబ్‌కు చెందిన ఒక రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. లుధియానాకు చెందిన 65 ఏళ్ల వృద్ధ రైతు గత పది నెలలుగా గులాల్ టోల్‌ ప్లాజా వద్ద నిరసన చేస్తున్నాడు. అయితే 'భారత్‌ బంద్‌'కు కొన్ని గంటల ముందు ఆయన బలవన్మరణం చెందాడు. లుధియానాలోని నిరసన ప్రాంతానికి సమీపంలో మెడలో వేసుకున్ని కండువాతో ఒక పైప్‌కు ఉరి వేసుకున్నాడు.