శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 10 నవంబరు 2020 (10:42 IST)

నితీశ్‌ను ఓడించిన కరోనా వైరస్ : జేడీయు అధికార ప్రతినిధి

బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మంగళవారం వెలువడుతున్నాయి. ఇప్పటివరకు వెల్లడైన ట్రెండ్స్ మేరకు ఆర్జేడీ - కాంగ్రెస్ సారథ్యంలోని మహా కూటమి విజయం సాధించనుంది. అయితే, ఒక్కటంటే ఒక్క ఫలితాన్ని కూడా ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. కానీ, ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ సారథ్యంలోని జేడీయు పార్టీకి చెందిన అధికార ప్రతినిధి కేసీ త్యాగి ముందుగానే ఓటమిని అంగీకరిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. 
 
ప్రాథమిక దశ ఫలితాలు వెలువడుతున్న తరుణంలోనే ఓటమిని అంగీకరిస్తున్నట్టు ఆయన చెప్పారు. ప్రజా తీర్పును తాము గౌరవిస్తున్నామన్నారు. అయితే, తాము ఆర్జేడీ చేతిలోనే లేక తేజశ్వి ప్రసాద్ యాదవ్ చేతిలోనే ఓడిపోలేదని... దేశాన్ని పట్టిపీడిస్తున్న కోవిడ్ మహమ్మారి చేతిలో ఓడిపోతున్నామని సెలవిచ్చారు. 
 
కేవలం కరోనా వల్లే తాము వెనుకబడ్డామని త్యాగి చెప్పుకొచ్చారు. గత 7 దశాబ్దాలుగా బీహార్ క్షిణిస్తూ వచ్చిందని... దాని ప్రభావం కూడా ఇప్పుడు తమపై పడిందన్నారు. మరోవైపు బీహార్‌లో నితీశ్ కుమార్ పార్టీ ప్రస్తుతం మూడో స్థానంలో కొనసాగుతోంది. తొలి స్థానంలో ఆర్జేడీ ఉండగా, రెండో స్థానంలో బీజేపీ ఉంది. అయితే ఎన్డీయే, యూపీఏ కూటమిల మధ్య టఫ్ ఫైట్ నడుస్తోంది. 
 
తాజా ట్రెండ్స్ సరళి మేరకు.. ఎన్డీయే 119 చోట్ల, ఎంజీబీ 107 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతుండగా, ఎల్జేపీ ఆరు స్థానాల్లో, ఇతరులు 11 చోట్ల ఆధిక్యంలో ఉన్నారు.