1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 24 జనవరి 2022 (11:04 IST)

బీహార్‌లో తుపాకీతో రెచ్చిపోయిన బీజేపీ మంత్రి కుమారుడు

బీహార్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి చెందిన మంత్రి కుమారుడు ఒకరు తుపాకీతో రెచ్చిపోయాడు. తన ఇంటి పక్కనే ఉన్న మామిడి తోటలో అనేకమంది పిల్లలు ఆటలు ఆడుకోవడం మంత్రి తనయుడుకి ఏమాత్రం నచ్చలేదు. దీంతో తుపాకీతో వారిపై విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. అలాగే, తన సిబ్బందితో కలిసి చేతికి చిక్కినవారిని గొడ్డును బాదినట్టు బాదాడు. 
 
ఈ ఘటనలో నలుగురు చిన్నారులు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా వుందని బాధిత చిన్నారుల తల్లిదండ్రులు చెబుతున్నారు. ఈ ఘటన వెస్ట్ చంపారన్ జిల్లా బేతియా సమీపంలోని హర్దియా గ్రామంలో జరిగింది. ఈ గ్రామంలో బీహార్ రాష్ట్ర పర్యాటక మంత్రిగా ఉన్న నారాయణ ప్రసాద్ సాహ్ ఇల్లు ఉంది. 
 
ఈ ఇంటి పక్కనే పెద్ద మామిడి తోట ఉండగా, ఇక్కడ ఆ గ్రామానికి చెందిన పిల్లలంతా కలిసి ఆడుకుంటుంటారు. అయితే, ఈ మామిడి తోటలో ఆటలు ఆడుకోవడానికి వీల్లేదని మంత్రి కుమారుడు బబ్లూ ప్రసాద్ సాహ్ హుకుం జారీచేశాడు. ఇందుకు పిల్లలు నిరాకరించడంతో తన వద్ద ఉన్న తుపాకీతో వారిపై బీభత్సం సృష్టించాడు. ఈ ఘటనపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.