1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 2 సెప్టెంబరు 2022 (09:50 IST)

చెవి నొప్పి కోసం ఆస్పత్రిలో చేరితే చేయిని కోల్పోయిన యువతి.. ఎక్కడ?

bihar girl
బిహార్ రాష్ట్రానికి చెందిన వైద్యులు మరోమారు తన విధుల్లో నిర్లక్ష్యం ప్రదర్శించారు. చెవి నొప్పిని తొలగించేందుకు ఆపరేషన్ చేశారు. కానీ, బాధితురాలు చేయిని కూడా కోల్పోవాల్సి వచ్చింది. దీనికి కారణం చెవి ఆపరేషన్ చేసేందుకు వాడిని ఇంజెక్షన్‌లలో ఒకటి వికటించింది. ఫలితంగా ఆమె చేయి రంగు మారిపోయింది. ఇది చివరకు ఆమె చేతినే తొలగించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ ఘటన బిహార్ రాష్ట్ర రాజధాని పాట్నాలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, శివహర్ జిల్లాకు చెందిన 20 యేళ్ళ రేఖ చెవినొప్పితో బాధపడుతూ రాజధాని పాట్నాలోని మహవీర్ సంస్థాన్ ఆస్పత్రిలో చేరింది. ఆమెను పరీక్షించిన వైద్యులు జూలై 11వ తేదీన ఆపరేషన్ చేశారు. ఆ తర్వాత ఎడమ చేతికి ఓ ఇంజక్షన్ వేసి పంపించారు. ఇంటికి వెళ్లిన కొన్ని గంటల్లోనే ఆమె చేయి రంగు మారిపోయింది. 
 
దీనికితోడు భరించలేని నొప్పి రావడంతో మళ్లీ ఆస్పత్రికి వెళ్లింది. ఆమె చేయిని చూసిన వైద్యులు.. ఏమీ కాదనీ తగ్గిబోతుందని భరోసా ఇచ్చి పంపించారు. కానీ, ఆ రంగుతో పాటు నొప్పి తగ్గలేదు. దీంతో ఆమె పలు ఆస్పత్రుల్లో చూపించగా, తక్షణం ఆపరేషన్ చేసి చేయిని తొలగించాలని లేనిపక్షంలో ప్రాణానికే ప్రమాదం ఉందని హెచ్చరించారు. 
 
దీంతో రోగితో పాటు ఆమె కుటుంబ సభ్యుల అనుమతితో వైద్యులు ఆపరేషన్ చేసి ఎడమ చేతిని తొలగించారు. కాగా, రోగికి ఇటీవలే నిశ్చితార్థమైంది. త్వరలోనే పెళ్లి జరగాల్సివుంది. ఇపుడు వైద్యులు చేసిన తప్పు వల్ల ఆమె వివాహం రద్దు అయింది.