శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : సోమవారం, 11 జనవరి 2021 (12:54 IST)

ఏడు రాష్ట్రాల్లో బర్డ్‌ఫ్లూ!

ఏడు రాష్ట్రాల్లో బర్డ్‌ఫ్లూ ఉన్నట్లు కేంద్రం నిర్ధారణకొచ్చింది. పక్షులు, కాకులు, జంతు జాలం మృత్యువాత పడటంతో అప్రమత్తమైంది. దీంతో స్థానిక యంత్రాగంతో సమన్వయానికి సిద్ధమైంది. బర్డ్‌ ఫ్లూ వ్యాప్తి చెందుతున్న ప్రాంతాలను పర్యవేక్షించాలని, నిరంతరం కమ్యూనికేట్‌ చేయాలని పశు సంవర్థక, పాడి పరిశ్రమ శాఖను కేంద్రం ఆదేశించింది.

ఉత్తరప్రదేశ్‌తో పాటు కేరళ, రాజస్తాన్‌, మధ్యప్రదేశ్‌, హిమాచల్‌ ప్రదేశ్‌, హర్యానా, గుజరాత్‌లతో బర్డ్‌ఫ్లూ ఆనవాళ్లు బయటపడ్డాయి. దీంతో బ్రతికున్న పక్షుల దిగుమతిపై ఢిల్లీ నిషేధం విధించింది. ఘజియాబాద్‌లో ఉన్న అతిపెద్ద పౌల్డ్రీ పరిశ్రమను 10 రోజుల పాటు మూసివేసింది. నమూనాలను జలంధర్‌ ల్యాబోరేటరీకి తరలించారు. సందేహాల కోసం 24 గంటల హెల్ఫ్‌ లైన్‌ నంబర్‌ను అధికారులు ఏర్పాటు చేశారు. ప్రతి జిల్లాలో రాపిడ్‌ రెస్పాన్స్‌ టీమ్స్‌ను ఏర్పాటు చేశారు.

వెటర్నరీ అధికారులు పక్షుల కేంద్రం, వన్య ప్రాణుల సంస్థలు, నీటి వనరులపై సర్వేలు చేపడుతున్నారు. దక్షిణ ఢిల్లీలోని జసోలాలోని జిల్లా పార్క్‌లో గడిచిన మూడు రోజుల్లో 24 కాకులు మృత్యువాత పడ్డాయి. దీంతో పార్క్‌లు మూతపడ్డాయి.

పొరుగు రాష్ట్రాల్లో బర్డ్‌ఫ్లూ విజృంభణతో పంజాబ్‌ అలర్ట్‌ అయింది. పౌల్ట్రీ, ప్రాసెస్‌ చేయని మాంసాహార దిగుమతులపై జనవరి 15 వరకు నిషేధం విధించింది. మధ్యప్రదేశ్‌లో 13 జిల్లాల్లో బర్డ్‌ఫ్లూ ఉన్నట్లు గుర్తించారు. 27 జిల్లాల్లో 1,100 కాకులు, అటవీ పక్షులు మృత్యువాత పడ్డాయి. దీంతో అగర్‌ మాల్వా ప్రౌల్డీ మార్కెట్‌కు మూతపడింది. చత్తీస్‌గఢ్‌లో జనవరి 8,9 తేదీల్లో పక్షులు మరణించాయి.

ఈ సంఘటనపై దర్యాప్తు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం రాపిడ్‌ ఫోర్స్‌ను ఏర్పాటు చేసింది. మహారాష్ట్రలోని పర్బాన జిల్లాలో ఓ పౌల్డ్రీ పరిశ్రమలో 900 కోళ్లు మృత్యువాత పడ్డాయి. ముంబయి, ధానే, బీడ్‌ జిల్లాల్లో కాకులు చనిపోయాయి. కేరళలో రెండు జిల్లాలో ఈ ఫ్లూ ఎక్కువగా ఉంది. పోస్ట్‌ ఆపరేషన్‌ నిఘా కోసం రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

బర్డ్‌ఫ్లూపై అప్రమత్తంగా ఉండాలని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు పశు సంవర్థక, పాడి పరిశ్రమ విభాగం లేఖ రాసింది. ముఖ్యంగా మానవులకు ఈ వ్యాధి సోకకుండా చూడాలని కోంది. చుట్టూ ప్రక్కన ఉన్న సరస్సులు, కాలువలు, పక్షుల కేంద్రాలు, జూలు, పౌల్డ్రీ పరిశ్రమపై దృష్టి సారించాలని సూచించింది.