1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 14 మే 2021 (10:51 IST)

బ్లాక్ ఫంగస్ విజృంభణ : లక్షణాలు ఇవే.... అలాంటివారికే అధిక సంక్రమణ

దేశంలో కరోనా వైరస్ ఓ వైపు విరుచుకుపడుతోంది. మరోవైపు, మరోవైపు బ్లాక్ ఫంగస్ వ్యాప్తి క్రమంగా పెరుగుతోంది. ఇది అన్ని రాష్ట్రాలకు వ్యాగంగా వ్యాపిస్తోంది. తెలంగాణలో ఇప్పటికే ఒక వ్యక్తి బ్లాక్ ఫంగస్ కారణంగా మృతి చెందడం కలకలం రేపుతోంది. మరోవైపు, ఉత్తరప్రదేశ్‌ను బ్లాక్ ఫంగస్ ఉలిక్కిపడేలా చేస్తోంది.
 
ఇప్పటికే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో 73 కేసులు బయటపడ్డాయి. వీటిలో అత్యధికంగా వారణాసిలో 20 కేసులు నమోదయ్యాయి. లక్నోలో 15, గోరఖ్‌పూర్‌లో 10, ప్రయాగ్‌రాజ్‌లో 6, గౌతమ్‌బుద్ధ్‌నగర్‌లో 5, మీరట్‌లో 4, కాన్పూర్, మధురలో రెండు చొప్పున, ఆగ్రాలో ఒక్క కేసు నిర్ధారణ అయ్యాయి.
 
బ్లాక్ ఫంగస్ కారణంగా కాన్పూర్‌లో ఇద్దరు కరోనా పేషెంట్లు మృతి చెందగా... మధురలో ఇద్దరు, లక్నోలో ఒక పేషెంట్ ఫంగస్ ఇన్ఫెక్షన్ కారణంగా కంటిచూపును కోల్పోయారు. భయంకరమైన ఈ ఫంగస్ విస్తరిస్తున్న నేపథ్యంలో యూపీలోని యోగి ప్రభుత్వం అలర్ట్ అయింది. 
 
ఫంగస్ వ్యాప్తి చెందుతున్న తొలి దశలోనే దాన్ని ఎదుర్కొనేందుకు 14 మంది వైద్య నిపుణులతో కూడిన కమిటీని ఏర్పాటు చేయాలని సీఎం యోగి ఆదేశించారు. ఈ కమిటీ ప్రస్తుత పరిస్థితిని సమీక్షించడమే కాకుండా... ప్రభుత్వానికి అవసరమైన సలహాలు, సూచనలు ఇస్తుంది.
 
అదేసమయంలో బ్లాక్ పంగస్ లక్షణాలను యూపీ వైద్యులు వెల్లడించారు కళ్లు, ముక్కు చుట్టూ ఎర్రబారడం, జ్వరం, తలనొప్పి, దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, నొప్పులు, నెత్తుటి వాంతులు, చురుకుదనంలో మార్పులు చోటుచేసుకోవడం.
 
సుదీర్ఘకాలంగా స్టెరాయిడ్స్ వాడుతున్న వారు, ఇమ్యూనిటీ చాలా తక్కువగా ఉన్నవారు బ్లాక్ ఫంగస్ బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. డయాబెటిస్ నియంత్రించలేని స్థాయిలో ఉన్నవారికి కూడా ప్రమాదం ఎక్కువగా ఉంటుందని వైద్యులు చెపుతున్నారు.