శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 15 జూన్ 2020 (13:35 IST)

అత్తారింటికి వెళుతూ నదిలో దూకేసిన నవవధువు.. ఎక్కడ?

ఆమెకు ఇష్టంలేని పెళ్లి చేశారో లేక వరుడు నచ్చలేదో తెలియదు గానీ.. పెళ్లి మండపం నుంచి అత్తారింటికి బయలుదేరిన నవ వధువు మార్గమధ్యంలో నదిలో దూకేసింది. ఈ ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని భోపాల్ సమీపంలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, రాజస్థాన్‌ రాష్ట్రంలోని అలాపుర్‌కు చెందిన ఓ యువతికి ఆదివారం మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన యువకుడితో వివాహమైంది. ఆ తర్వాత అమ్మాయిని అత్తారింటికి పంపే వేడుక కూడా ఘనంగానే జరిగింది. 
 
ఈ కార్యక్రమం ముగిసిన తర్వాత తన భర్త, అత్తమామలతో కలిసి మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలోని తన అత్తారింటికి నవ వధువు  బయలుదేరింది. అయితే, షియోపూర్ చంబల్ నదిపై వాహనం వెళుతున్న వేళ, ఆమె తనకు వాంతి వస్తోందని చెప్పింది. కారును ఆపాలని కోరినా, డ్రైవర్ ఆపకుండా పోతుంటే, స్టీరింగ్‌ను గట్టిగా పట్టుకోవడంతో, డ్రైవర్ బ్రేకులు వేశాడు.
 
ఆ వెంటనే వాహనాన్ని దిగిన ఆమె, వాహనంలోని భర్త, ఇతరులకు ఏం జరుగుతోందో అర్థమయ్యేలోపే చంబల్ నదిలో దూకేసింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు, ఆమె కోసం గాలింపు చర్యలు చేపట్టారు. రాత్రి పెళ్లయిన తర్వాత కూడా ఆమె బాగానే ఉందని, ఇంతలోనే ఏమైందో తమకు అర్థం కావడం లేదని వధువు తండ్రి వాపోయాడు. ఈ విషయంలో కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు.