గురువారం, 28 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : ఆదివారం, 3 సెప్టెంబరు 2017 (10:27 IST)

కొత్త మంత్రులు వీరే.. వైజాగ్ ఎంపీ హరిబాబుకు మొండిచేయి?

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తాజాగా చేపట్టబోతున్న కేంద్ర మంత్రిమండలి పునర్య్వవస్థీకరణలో తొమ్మిదిమంది కొత్తవారికి చోటు లభించింది. వీరితో రాష్ట్రపతి రాంనాథ్‌ కోవింద్‌ ఆదివారం ఉదయం 10.30 గంటలకు ప్రమాణం చేయి

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తాజాగా చేపట్టబోతున్న కేంద్ర మంత్రిమండలి పునర్య్వవస్థీకరణలో తొమ్మిదిమంది కొత్తవారికి చోటు లభించింది. వీరితో రాష్ట్రపతి రాంనాథ్‌ కోవింద్‌ ఆదివారం ఉదయం 10.30 గంటలకు ప్రమాణం చేయించనున్నారు. ప్రధాని మోడీ, భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్‌షాలు భారీ కసరత్తుతో కొత్త మంత్రులను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. 
 
సాధారణ ఎన్నికలకు మరో 21 నెలలు సమయమే మిగిలి ఉండటం, వచ్చే ఏడాది లోపల కొన్ని రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో చేపడుతున్న కేంద్ర మంత్రి మండలి విస్తరణలో ప్రభుత్వాధినేతగా తన జట్టు అన్ని విధాలా అత్యుత్తమంగా ఉండాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ భావిస్తున్నారు.
 
ఈ తొమ్మిది మంది కొత్త మంత్రుల్లో హర్దీప్‌ పూరీ, సత్యపాల్‌ సింగ్‌, అల్ఫోన్స్‌ కన్నన్‌థనం, అశ్వినీకుమార్‌ చౌబే, వీరేంద్ర కుమార్‌, శివప్రతాప్‌ శుక్లా, అనంత్‌కుమార్‌ హెగ్డే, రాజ్‌ కుమార్‌ సింగ్‌, గజేంద్ర సింగ్‌ షెకావత్‌లు ఆదివారం మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. వీరందరికీ కీలకమైన శాఖలను అప్పగించే అవకాశం ఉంది. వీరిలో హర్దీప్‌ సింగ్‌ మాజీ ఐఎఫ్‌ఎస్‌ అధికారి కాగా, సత్యపాల్‌ సింగ్‌ ముంబై మాజీ పోలీస్‌ కమిషనర్‌, అల్ఫోన్స్‌ కన్నన్‌థనం విశ్రాంత ఐఏఎస్‌ అధికారి కావడం గమనార్హం. 
 
కాగా, ప్రస్తుతం మోడీ మంత్రి మండలిలో 73 మంత్రులు ఉన్నారు. వీరిలో ఏడుగురు రాజీనామాలు సమర్పించారని తెలుస్తోంది. వీరందరి రాజీనామాలను ప్రధాని ఆమోదిస్తే మంత్రివర్గ సభ్యుల సంఖ్య 66కు చేరుతుంది. కేబినెట్‌లో గరిష్టంగా 81 మందికే అవకాశం ఉంది కనుక కొత్తగా 15 మందిని చేర్చుకునే వీలుంది. కానీ, ప్రస్తుతానికి తొమ్మిదిమందికే పరిమితమైనట్లు తెలుస్తోంది.
 
ఇకపోతే.. విశాఖ ఎంపీ కంభంపాటి హరిబాబును కేంద్ర మంత్రివర్గంలో చేర్చుకోబోతున్నట్లు విస్తృత ప్రచారం జరిగింది. దీంతో ఆయన తన సతీమణి, కుమార్తెతో కలిసి శనివారం రాత్రి 12 గంటలకు ఢిల్లీకి చేరుకున్నారు. అయితే రాత్రి అనధికారికంగా చలామణిలోకి వచ్చిన కొత్తమంత్రుల జాబితాలో ఆయన పేరు కనిపించలేదు. మంత్రివర్గంలో అవకాశంపై తనకు సమాచారం లేదని కంభంపాటి అన్నారు. దీంతో ఆయనకు మొండిచేయి చూపించినట్టు తెలుస్తోంది.