1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : శనివారం, 15 మే 2021 (19:50 IST)

ఆంధ్రప్రదేశ్‌లో మీడియా సంస్థలపై కేసు: స్పందించిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీడియా సంస్థలపై కేసు నమోదు చేయడంపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. పత్రికా స్వేచ్ఛకు భంగం కలిగించేలా ప్రభుత్వాలు వ్యవహరించడం సరికాదని పేర్కొన్నారు.
 
ఇంకా ఆయన మాట్లాడుతూ.. సమాచారాన్ని ప్రజలకు చేరవేసే బాధ్యత నెరవేరుస్తున్న మీడియాపై కేసుల బనాయింపు సరికాదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీడియా సంస్థలపై ప్రభుత్వం ఒత్తిడి తెస్తున్న అంశాన్ని కేంద్ర సమాచార శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్ దృష్టికి తీసుకు వెళ్తా.
 
దేశ సమగ్రతకు భంగం కలిగించే అంశాలు మినహా ఇతర రాజకీయ కారణాలతో మీడియాపై రాజద్రోహం కేసు మోపడం ఆమోదయోగ్యం కాదు. కేంద్ర ప్రభుత్వంపై అనేక మీడియా సంస్థలు తీవ్ర విమర్శలు చేసినప్పటికీ ఏనాడు వారిపై ఆంక్షలు విధించలేదు.
 
ఇప్పటివరకూ బీజేపీ కానీ కేంద్ర ప్రభుత్వం కానీ మీడియా సంస్థపై నిషేధం విధించలేదు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీడియాపై ఒత్తిడి చేస్తూ కేసులు పెట్టారన్న వార్తలపై సంబంధిత శాఖతో చర్చిస్తా అని చెప్పారు.