గురువారం, 28 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్

విక్రమ్ ల్యాండర్‌పై ఆశలు వదులుకోలేదు : ఇస్రో

చంద్రుడి దక్షిణ ధృవం అన్వేషణ నిమిత్తం చంద్రయాన్-2 పేరుతో చంద్రమండలంపైకి పంపిన విక్రమ్ ల్యాండర్ చివరి నిమిషంలో ఫెయిల్ అయింది. దీంతో కోట్లాది మంది భారతీయులు తీవ్ర నిరాశకు గురయ్యారు. ఈ ప్రయోగాన్ని భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో చేపట్టగా 98 శాతం విజయవంతమైంది. 
 
అయితే, జాబిల్లిపై దిగే క్రమంలో విక్రమ్ ల్యాండర్ హార్డ్ ల్యాండింగ్ కారణంగా భూమితో సంబంధాలు తెగిపోయాయి. ఈ నేపథ్యంలో ఇస్రో బుధవారం కీలక ప్రకటన చేసింది. విక్రమ్ ల్యాండర్‌పై ఆశలు వదులుకోలేదని, సంబంధాల పునరుద్ధరణకు ప్రయత్నిస్తూనే ఉన్నామని తెలిపింది. 
 
విక్రమ్ కూలినట్టుగా భావిస్తున్న ప్రాంతం ప్రస్తుతం రాత్రి సమయం కావడంతో తమ ప్రయత్నాలకు విరామం ఇచ్చినట్టు శాస్త్రవేత్తలు తెలిపారు. అక్కడ రాత్రి సమయం 14 రోజులు ఉండడంతో విక్రమ్‌కు సౌరశక్తి లభించదని, మళ్లీ పగటి సమయం ఆరంభమయ్యాక విక్రమ్ ల్యాండర్‌తో సంబంధాల పునరుద్ధరణకు తిరిగి ప్రయత్నాలు ప్రారంభిస్తామని తెలిపారు. 
 
కాగా, విక్రమ్ ల్యాండర్ ఆచూకీ తెలుసుకునేందుకు అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా కూడా తీవ్రంగా కృషి చేసిన విషయం తెల్సిందే. ఇందుకోసం ప్రత్యేక శాటిలైట్‌ను కూడా పంపించింది. ఇది కొన్ని ఫోటోలు తీయగా, అందులో విక్రమ్ ల్యాండర్ హార్డ్ ల్యాండింగ్ అయినట్టు గుర్తించింది.