1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వరుణ్
Last Updated : శుక్రవారం, 1 డిశెంబరు 2023 (14:43 IST)

టాయిలెట్ కోసం బస్సు ఆపమంటే... బస్సు నుంచి కిందకు తోసేసిన కండక్టర్

టాయిలెట్ కోసం బస్సు ఆపమన్నందుకు ఓ ప్రయాణికుడుని కండక్టర్ కిందకు తోసివేశాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఫిలిభిత్‌లో జరిగింది. అర్థరాత్రి టాయిలెట్ కోసం బస్సు ఆపన్నందుకు ఈ ఘోరం జరిగింది. బస్సు నుంచి ప్రయాణికుడుని కండక్టర్ కిందకు తోసివేయడంతో బస్సు వెనుక చక్రాల కింద పడి ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనలో బస్సు డ్రైవర్‌తో పాటు కండక్టర్ కూడా పారిపోయాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే,
 
రాజస్థాన్ రాజధాని జైపూర్‌లో కూలిపనులు చేసే పిలిభిత్ జెహానాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రాంనగర్‌కు చెందిన విజయపాల్ (38) అనే వ్యక్తి దీపావళి కోసం ఇంటికి వచ్చాడు. ఈయన తన కుటుంబ సభ్యులతో కలిసి డబుల్ డెక్కర్ ప్రైవేటు బస్సులో తిరిగి జైపూర్‌ బయలుదేరాడు. అర్థరాత్రి వేళ మూత్ర విసర్జన కోసం బస్సు ఆపాలని కండక్టర్‌‍ను విజయపాల్ కోరగా, అందుకు ఆయన నిరాకరించాడు. దీంతో వారిద్దరి మధ్య వాగ్వివాదం జరిగింది. 
 
ఈ క్రమంలో బస్సు పిలిభిత్ బైపాస్‌లోని  సంజయ్ నగర్ టర్న్ వద్దకు చేరుకోగానే విజయ్‌పాల్‌కు కండక్టర్ బస్సు నుంచి ఒక్కసారిగా కిందకు తోసేశాడు. బస్సు వెనుక చక్రాల కిందపడిన విజయపాల్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఆ సమయంలో బస్సలో 55 మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ ఘటనపై ఆగ్రహించిన ప్రయాణికులు కండక్టర్, డ్రైవర్‌పై ఘర్షణకు దిగారు. దీంతో బస్సును ఆపేసిన వారు.. అక్కడ నుంచి పారిపోయారు. దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. పరారీలో ఉన్న బస్సు డ్రైవర్, కండక్టర్ కోసం గాలిస్తున్నారు.