1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 10 నవంబరు 2019 (13:29 IST)

ఎన్సీపీ రైట్ అంటే కాంగ్రెస్‌తో కలిసి ప్రభుత్వం : శివసేన

ఎన్సీపీ సమ్మతించినట్టయితే కాంగ్రెస్ పార్టీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు శివసేన చర్యలు చేపట్టినట్టు తెలుస్తోంది. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ - శివసేన కూటమి విజయం సాధించినప్పటికీ ప్రభుత్వ ఏర్పాటు అంశంలో మాత్రం పొత్తు కుదరలేదు. 
 
ముఖ్యమంత్రి కుర్చీ కోసం శివసేన పట్టుబడుతోంది. ఈ డిమాండ్‌ను శివసేన ఆదివారంనాడు మరింత పట్టుబిగించింది. ప్రభుత్వం ఏర్పాటుకు ఎవరూ ముందుకు రాకపోతే అందుకు శివసేన ముందుకు వస్తుందని ఆ పార్టీ నేత సంజయ్ రౌత్ ఆదివారంనాడిక్కడ తెలిపారు. 
 
ఇందుకు అనుగుణంగా తమతో కలిసి రావాల్సిందిగా కాంగ్రెస్‌కు కూడా శివసేన సంకేతాలిచ్చింది. రాష్ట్రానికి కాంగ్రెస్ శత్రువేమీ కాదని, తప్పసరిగా ప్రభుత్వంలో కాంగ్రెస్ చేరాలని ఆ పార్టీ తాజాగా పేర్కొంది. ప్రభుత్వంలో ఎన్‌సీపీని కలుపుకొని వెళ్లేందుకు కూడా మార్గాలు అన్వేషిస్తున్నట్టు ఆ పార్టీ తెలిపింది.
 
కాంగ్రెస్‌ ఒప్పుకుంటే ప్రభుత్వంలో చేర్చుకుని ఎన్‌సీపీతో కలిసి కూటమి సర్కార్ ఏర్పాటు చేయాలని శివసేన తాజా ఆలోచనగా ఉంది. శివసేన ప్రభుత్వంలో చేరేందుకు స్థానిక కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా సుమఖంగానే ఉన్నారని చెబుతున్నారు. దీనిపై పార్టీ స్థానిక నేతలు అధిష్ఠానాన్ని ఒప్పించే ప్రయత్నాలు కూడా సాగిస్తున్నట్టు తెలుస్తోంది. 
 
అయితే, కాంగ్రెస్ అధిష్టానం మాత్రం ఇతమిత్ధంగా తమ వైఖరిని వెల్లడించడం లేదు. శివసేనతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేస్తే మహారాష్ట్రలో కాంగ్రెస్‌ ఉనికి ప్రమాదంలో పడుతుందని ఆ పార్టీ అధిష్ఠానం అభిప్రాయంగా ఉందంటున్నారు. 
 
మరోవైపు, ఎన్‌సీపీ మాత్రం బీజేపీతో శివసేన పూర్తిగా తెగతెంపులు చేసుకుంటేనే ప్రత్నామ్నాయ ప్రభుత్వ ఏర్పాటు ఆలోచన చేస్తామంటోంది. లేదంటే తాము ప్రతిపక్షంలోనే కూర్చుంటామంటోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ను మంచి చేసుకుని ఎన్‌సీపీతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు శివసేన తాజాగా పావులు కదుపుతోంది.