గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 8 నవంబరు 2019 (17:37 IST)

ఫిప్టీ - ఫిప్టీకి అంగీకరించే ప్రసక్తే లేదు : దేవేంద్ర ఫడ్నవిస్

మహారాష్ట్రంలో అధికారాన్ని పంచుకునే ఫార్ములాకు అంగీకరించే ప్రసక్తే లేదనీ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ స్పష్టం చేశారు. పైగా, కొన్నేళ్ళుగా బీజేపీకి అండగా నిలిచిన వారందరికీ ఆయన ధన్యవాదాలు తెలిపారు. కాగా, ఈయన తన ముఖ్యమంత్రి పదవికి శుక్రవారం రాజీనామా చేసిన విషయం తెల్సిందే. 
 
ఆ తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఈ ఎన్నికల్లో బీజేపీ, శివసేన కూటమికి ప్రజలు ఓటేశారు. శివసేనతో ఫిఫ్టీ-ఫిఫ్టీ ఫార్ములా పంచుకునేది లేదు. అసలు 50:50 ఫార్ములా గురించే చర్చించలేదని స్పష్టంచేశారు. 
 
'మహారాష్ట్రలో రహదారులు, మౌలిక సదుపాయాల అభివృద్ధికి ఎంతగానే కృషి చేశాను. ఐదేళ్లుగా జరిగిన అభివృద్ధి చాలా సంతోషం కలిగించింది. మేం చేసిన పనులతో ప్రజలు సంతృప్తి చెందారు కనుకే మళ్లీ ఆశీర్వదించారు. ఈ ఐదేళ్లు రైతుల సంక్షేమానికి ఎంతో కృషి చేశాం. ప్రభుత్వాన్ని స్వచ్ఛంగా నడిపించాం. ఎన్నో సమస్యలను ఎదుర్కొన్నాం. వాటిని సమర్థంగా పరిష్కరించాం అని చెప్పారు. 
 
అలాగే, మహారాష్ట్రను పాలించే అధికారం ఇచ్చినందుకు ప్రధాని నరేంద్ర మోడీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాకు కృతజ్ఞతలు. శివసేన వ్యాఖ్యలు ఎంతో బాధ కలిగించాయి. శివసేనతో సీఎం పదవీ కాలాన్ని పంచుకునే ప్రసక్తే లేదు. ప్రభుత్వ ఏర్పాటుకు అన్ని దారులు తెరిచే ఉన్నాయని ఆయన ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు. 
 
'రాష్ట్రంలో మెజార్టీ స్థానాలు సాధించిన అతిపెద్ద పార్టీ మాది. రెండున్నరేళ్ల పదవీకాలంపై ఏనాడూ చర్చ జరగలేదు. పదవీకాలంపై నా సమక్షంలో ఎప్పుడూ చర్చ జరగలేదు. అమిత్ షా, ఉద్ధవ్ ఠాక్రే మధ్య చర్చ జరిగితే మాత్రం నాకు తెలియదు. మేం మాట్లాడేదే లేదని శివసేన చెప్పడంతో మాకేమీ అర్థం కావడం లేదు. సంక్షోభ పరిష్కారం కోసం నేను చాలా ప్రయత్నించా. శివసేన వ్యవస్థాపకుడు బాల్ ఠాక్రేను బీజేపీ ఎప్పుడూ అగౌరవపరచలేదన్నారు. 
 
ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు మాకు అవకాశం ఉందని ఎన్నికల ఫలితాల అనంతరం ఉద్ధవ్ ఠాక్రే చెప్పారు. ఇప్పటి వరకు శివసేన మమ్మల్ని సంప్రదించలేదు కానీ ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీలను కలిసింది. భాగస్వామి పార్టీ మా గురించి చెడుగా మాట్లాడటం అంగీకరించలేం. మోడీ గురించి శివసేన ఇలాగే మాట్లాడితే ఆపార్టీతో స్నేహంపై పునరాలోచన చేస్తాం. కొత్త ప్రభుత్వం ఏర్పడే వరకు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉండాలని గవర్నర్ నన్ను కోరారు అని వివరించారు.