శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 7 నవంబరు 2019 (12:50 IST)

కొన్ని గంటల్లో ముగియనున్న డెడ్‌లైన్ : హుటాహుటిన ముంబైకు గడ్కరీ

మహారాష్ట్రలో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు ఉన్న గడువు మరికొన్ని గంటల్లో ముగియనుంది. అయినప్పటికీ బీజేపీ - శివసేనల మధ్య ప్రభుత్వ ఏర్పాటుపై నెలకొన్న పీఠముడి వీడేలా కనిపించడం లేదు. దీంతో కేంద్ర మంత్రి, మహారాష్ట్ర బీజేపీ సీనియర్ నేత నితిన్ గడ్కరీ హుటాహుటిన నాగ్‌పూర్‌కు చేరుకున్నారు. 
 
శనివారంలోగా కొత్త ప్రభుత్వం కొలువు దీరకుంటే రాష్ట్రపతి పాలన తప్పనిసరి అయ్యే పరిస్థితులు ఉన్నాయి. దీంతో బీజేపీ, శివసేన రాష్ట్ర నేతల మధ్య సమన్వయాన్ని కుదిర్చేందుకు నితిన్ తన వంతు కృషి చేయనున్నారు. 
 
తనకున్న అన్ని అపాయింట్ మెంట్లు, అధికారిక కార్యక్రమాలను రద్దు చేసుకున్న గడ్కరీ, నాగపూర్‌కు వచ్చారు. ఆయన నేడు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్‌‌ను ప్రత్యేకంగా కలుస్తారని బీజేపీ వర్గాలు వెల్లడించాయి. 
 
నాగపూర్‌లో మహారాష్ట్ర ప్రస్తుత రాజకీయ పరిస్థితిపై పలువురు నేతలతో చర్చించనున్నట్టు నితిన్ గడ్కరీ, తన ప్రయాణానికి ముందు మీడియాకు తెలిపారు.
 
కాగా, ఫడ్నవీస్ స్థానంలో గడ్కరీని సీఎంగా ప్రతిపాదిస్తే, శివసేన నుంచి అభ్యంతరాలు ఉండక పోవచ్చన్న వార్తలూ వస్తున్నాయి. ఇరు పార్టీలకూ కావాల్సిన వ్యక్తిగా సీఎం పీఠంపై గడ్కరీని కూర్చోబెట్టాలన్న డిమాండ్ కూడా వినిపిస్తోంది. 
 
తాము సూచించిన విధంగా సీఎం పదవిని చెరి సగం పంచుకునేందుకు దేవేంద్ర ఫడ్నవీస్ ఎంతమాత్రమూ అంగీకరించక పోవడంతో, అతన్ని గద్దెనెక్కించే పనే లేదని శివసేన తేల్చి చెబుతోంది. మంగళవారం నాడు మోహన్ భగవత్ ను ఫడ్నవీస్ కలిసి చర్చించిన గంటల వ్యవధిలో నితిన్ గడ్కరీ రంగంలోకి దిగడం గమనార్హం.