1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 12 మే 2024 (16:54 IST)

యువరాజు కంటే కాంగ్రెస్ పార్టీకి తక్కువ సీట్లు : ప్రధాని మోడీ ఎద్దేవా

narendra modi in ap
ప్రస్తుతం జరుగుతున్న లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి వచ్చే సీట్ల సంఖ్యపై ప్రధాని నరేంద్ర మోడీ జోస్యం చెప్పారు. ఈ దఫా కాంగ్రెస్ పార్టీకి ఆ పార్టీ యువరాజు వయసు కంటే తక్కువ సీట్లు వస్తాయంటూ ఎద్దేవా చేశారు. తృణమూల్‌ కాంగ్రెస్‌ ఓట్‌ బ్యాంక్‌ రాజకీయాలు చేస్తోందని ఆయన ఆరోపించారు. సందేశ్‌ఖాలీలో హింసకు గురైన మహిళలను ఆ పార్టీ గూండాలు బెదిరిస్తున్నారన్నారు. 
 
లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా, పశ్చిమ బెంగాల్‌లోని హుగ్లీ, ఉత్తర 24 పరగణాల జిల్లాల్లో జరిగిన ఎన్నికల ప్రచారంలో ప్రధాని ప్రసంగించారు. ఈ సారి కాంగ్రెస్‌కు యువరాజు (రాహుల్‌) వయసు కంటే తక్కువ సీట్లు వస్తాయని ఎద్దేవా చేశారు. ఆ పార్టీ చరిత్రలో ఎన్నడూ చూడనన్ని తక్కువ స్థానాల్లో విజయం సాధించనుందని పేర్కొన్నారు. టీఎంసీ మరోసారి విజయం సాధించే అవకాశమే లేదని మోడీ అన్నారు. కాంగ్రెస్‌-లెఫ్ట్‌ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే స్థితిలో లేవని చెప్పారు. రాష్ట్రంలో స్థిరమైన ప్రభుత్వం ఎన్‌డీఏతోనే సాధ్యమన్నారు.
 
ఇక ఉత్తర 24 పరగణ జిల్లాలో జరిగిన ర్యాలీలో ప్రధాని మాట్లాడుతూ టీఎంసీ సర్కారు మన అక్కాచెల్లెళ్లకు ఏం చేసిందో ప్రజలంతా చూశారని విమర్శించారు. ఇప్పుడు సందేశ్‌ఖాలీ బాధితులను టీఎంసీ గూండాలు షాజహాన్‌ షేక్‌ పేరు చెప్పి బెదిరిస్తున్నారన్నారు. నిందితులను కాపాడటానికి ఆ పార్టీ అన్ని ప్రయత్నాలు చేస్తోందన్నారు. ఆ పార్టీ పాలనలో బెంగాల్‌ పూర్తి అవినీతి రాష్ట్రంగా మారిపోయిందన్నారు. రాష్ట్రం నేరగాళ్లతో బాంబుల తయారీ కేంద్రమైందని మండిపడ్డారు.