మంగళవారం, 2 జులై 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వరుణ్

కార్యకర్తతో కాళ్ళకు అంటిన బురదను కడిగించుకున్న కాంగ్రెస్ నేత!!

foot wash
మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీకి చెందిన నానా పటోల్ అనే నేత తాజాగా చేసిన పని ఇపుడు వివాదాస్పదమైంది. ఓ కార్యకర్తతో కాళ్ల కడిగించుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, నానా పటోల్ కాళ్ళకు అంటిన బురదను ఓ కార్యకర్తతో కడిగించుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో ఇపుడు వైరల్ కావడంతో నెట్టింట వైరల్ అయింది. 
 
ఈ వీడియోపై బీజేపీ నేతలు తీవ్రంగా స్పందించారు. కాంగ్రెస్ నాయకుల ఫ్యూడల్ మనస్తత్వానికి ఇది నిదర్శనమని బీజేపీ నేత షెహజాద్ పూనావాలా విమర్శించారు. కాంగ్రెస్ నాయకులు ఓటర్లను, కార్యకర్తలను బానిసల్లా చూస్తారని ఆరోపించారు. అధికారంలో లేనప్పుడే వారు ఇలా ప్రవర్తిస్తే... అధికారంలోకి వస్తే ఎలా ఉంటారో అర్థం చేసుకోవచ్చునని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్, నానా పటోల్ వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
 
మోడీ అత్యున్నత స్థానంలో ఉన్నప్పటికీ తన పాదాలను ఎవరినీ తాకనీయరని... కాంగ్రెస్ నాయకులు అందుకు విరుద్ధంగా ఉన్నారని బీజేపీ నేత శాంతికుమార్ అన్నారు. కాంగ్రెస్ పార్టీలో బానిసత్వ ఆలోచన గాంధీ కుటుంబం నుంచి మొదలై పార్టీ మొత్తానికి విస్తరించిందని ఎద్దేవా చేశారు. 
 
వీడియోపై నానా పటోల్ స్పందించారు. తాను ఓ సభకు వెళ్లినప్పుడు కాళ్లకు బురద అంటుకుందని, ఓ కార్యకర్త నీళ్లు తీసుకువచ్చారని... ఆయన నీళ్లు పోస్తుంటే తాను కాళ్లు కడుక్కున్నానని చెప్పారు. తాను రైతు కుటుంబం నుంచి వచ్చానని... బురదలో తిరగడం తనకు కొత్త కాదన్నారు. ఇలాంటి ఆరోపణలతో తాను బాధపడటం లేదని... ఏదేమైనా తనకు పబ్లిసిటీ ఇచ్చినందుకు థ్యాంక్స్ అని చురక అంటించారు.