గురువారం, 4 జులై 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వరుణ్
Last Updated : మంగళవారం, 3 అక్టోబరు 2023 (13:58 IST)

కోళికోడ్ తీరంలో తిమింగల కళేబరం - చూసేందుకు ఎగబడుతున్న స్థానికులు

whale
కేరళ రాష్ట్రంలోని కోళికోడ్ సముద్రతీరానికి ఓ భారీ తిమింగల కళేబరం కొట్టుకొచ్చింది. దీన్ని చూసేందుకు స్థానిక ప్రజలు ఎగబడుతున్నారు. ఈ తిమింగలం పొడవు దాదాపు 50 అడుగులకు పైమాటగానే ఉంది. అయితే, ఇది బాగా ఉబ్బిపోయి వుండటంతో పేలిపోయే ప్రమాదం ఉందని హెచ్చరిస్తూ దాన్ని సమీపానికి జనాలు వెళ్లకుండా పోలీసులు జాగ్రత్తలు తీసుకున్నారు. 
 
ఈ నీలి తిమింగలం (బ్లూ వేల్) కోళికోడ్ తీరానికి కొట్టుకొచ్చింది. దీని పొడవు 15 మీటర్ల మేరకు ఉంది. స్థానిక జాలర్ల ద్వారా దీనిగురించి సమాచారం అందుకున్న పోలీసులు, ఆరోగ్యాధికారి ప్రమోద్ వెంటనే బీచ్‌కు చేరుకుని తిమింగల కళేబరాన్ని పరిశీలించారు. అయితే, ఇది చనిపోవడానికి కారణాలు తెలియాల్సివుంది. అందుకే తీరంలోనే పోస్టు మార్టం నిర్వహించేలా చర్యలు చేపట్టారు. అలాగే, ఆ తీరంలోనే పెద్గ గొయ్యి తీసి పాతిపెడతామని వారు తెలిపారు. 
 
తీరానికి కొట్టుకొచ్చిన బ్లూవేల్‌ కళేబరానికి సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో దీన్ని చూసేందుకు స్థానికులతో పాటు ఇతర చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు కూడా తీరానికి చేరుకుంటున్నారు. నిజాముద్దీన్ అనే యూజర్ ఈ వీడియోను షేర్ చేస్తూ దయచేసి ఎవరూ ఆ కళేబరం వద్దకు వెళ్లొద్దని, అది పేలిపోయి గాయాలపాలయ్యే అవకాశం ఉందని హెచ్చరించారు. 
 
సాధారణంగా పెద్ద పెద్ద తిమింగలాల కళేబరాల్లో ఉన్న వాయువుల్లో పీడనం ఎక్కువై ఒక్కోసారి పేలిపోతుంటాయి. అవి కొన్నిసార్లు నెమ్మదిగా విడుదలవుతుంటాయి. మరికొన్ని సందర్భాల్లో మాత్రం భారీ పేలుడుతో బయటకు వస్తాయి గతంలో ఇలాంటి సంఘటనలు అనేకం ఉన్నాయి.