1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వరుణ్
Last Updated : గురువారం, 21 సెప్టెంబరు 2023 (10:42 IST)

కేరళ సరిహద్దులు దాటి బెంగాల్‌కు చేరిన నిపా వైరస్

nipah virus
కేరళ రాష్ట్రాన్ని వణికించిన నిపా వైరస్ ఇపుడు అనేక రాష్ట్రాల సరిహద్దులు దాటి వెస్ట్ బెంగాల్ రాష్ట్రానికి చేరుకుంది. కేరళ రాష్ట్ర నుంచి బెంగాల్‌కు వెళ్లిన ఓ బెంగాల్ యువకుడిలో నిపా వైరస్ తరహా లక్షణాలు బయటపడటం సంచలనంగా మారింది. నిపా వైరస్ పశ్చిమబెంగాల్లో కాలుపెట్టిందా? అన్న భయాలు వ్యక్తమవుతున్నాయి. 
 
బుర్ద్వాన్ జిల్లాకు చెందిన యువకుడు పొట్టకూటి కోసం కేరళకు వలస వెళ్లాడు. ఇటీవలే తిరిగొచ్చిన అతడు తీవ్ర జ్వరం, కడుపులో తిప్పడం, గొంతులో ఇన్ఫెక్షన్ బారినపడటంతో కుటుంబసభ్యులు ఆసుపత్రిలో చేర్పించారు. అయితే, నిపా వైరస్ నిర్ధారించేందుకు పరీక్షలు నిర్వహించాల్సి ఉందని కుటుంబసభ్యులు తెలిపారు. నీపా కేసులు అధికంగా ఉన్న కేరళ వచ్చిన యువకుడి విషయంలో చాలా అప్రమత్తంగా ఉంటున్నామని ప్రభుత్వ ప్రభుత్వ అధికారి ఒక వ్యాఖ్యానించారు.
 
కేరళలో ఉండగానే అతడు తీవ్ర జ్వరంతో బాధపడ్డాడని ప్రభుత్వ అధికారులు వెల్లడించారు. స్థానిక ఆసుపత్రిలో కొంత కాలం చికిత్స తర్వాత యువకుడికి జ్వరం తగ్గడంతో డిశ్చార్జ్ అయినట్టు పేర్కొన్నారు. ఆ తర్వాత పశ్చిమ బెంగాల్క తిరిగొచ్చిన రెండు రోజులకే బాధితుడు అనారోగ్యం పాలయ్యాడని చెప్పారు. తొలుత అతడిని నేషనల్ మేడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్కు తరలించారని, ఆ తర్వాత బెలియఘాటా ఐడీ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారని పేర్కొన్నారు.