1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వరుణ్
Last Updated : బుధవారం, 13 సెప్టెంబరు 2023 (12:58 IST)

కేరళ రాష్ట్రంలో అసహజ మరణాలు.. కోళికోడ్‌కు ప్రత్యేక వైద్య బృందం

nipah virus
కేరళ రాష్ట్రంలో రెండు అసహజ మరణాలు సంభవించాయి. ఇవి నిఫా వైరస్ కారణంగానే సంభవించినట్టు భావిస్తున్నారు. దీంతో ఆ రాష్ట్రానికి ప్రత్యేక వైద్య బృందాన్ని కేంద్రం పంపించింది. ఈ ప్రాణాంతక వైరస్ మరో ఇద్దరు వైద్యులకు కూడా సోకినట్టు కేంద్రం తేల్చింది. 
 
ప్రస్తుతం బాధితులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మరోవైపు, కేరళలో పరిస్థితిని సమీక్షించి రాష్ట్ర ప్రభుత్వానికి సాయం చేసేందుకు కేంద్ర బృందం కేరళకు చేరుకుంది. ఈ మేరకు కేంద్ర మంత్రి మాన్సుఖ్ మాండవీయ తాజాగా ఓ ప్రకటన చేశారు. నీఫా వైరస్ కారణంగా తొలి మరణం ఆగస్టు 30న సంభవించగా మరో వ్యక్తి సోమవారం కన్నుమూశారు. 
 
'రాష్ట్రంలో నీపా వైరస్ ఇన్ఫెక్షన్ ఉన్నట్టు నిర్ధారణ అయ్యింది. దీని వల్ల ఇద్దరు మరణించారు. మొత్తం నలుగురి శాంపిళ్లు పరీక్షలకు పంపించగా ఇద్దరికి నీపా వైరస్ సోకినట్టు తేలింది. మరో ఇద్దరికి రిపోర్టుల్లో నెగెటివ్ వచ్చింది' అని ముఖ్యమంత్రి పినరయి విజయన్ తన ఫేస్‌బుక్ ఖాతాలో పోస్టు చేశారు. 
 
మరోవైపు, నిఫా వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం రంగంలోకి దిగింది. ఇప్పటికే ఓ కంట్రోల్ రూం ఏర్పాటు చేసిన ప్రభుత్వం, ప్రజలు మాస్కులు ధరించాలని సూచించింది. ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉందని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొంది.