బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 27 మార్చి 2021 (12:59 IST)

రంగుల పండుగపై ఆంక్షలు... పలు రాష్ట్రాల్లో వేడుకలు రద్దు

దేశంలో అత్యంత వేడుకగా జరుపుకునే పండుగల్లో హోళీ పండుగ ఒకటి. కానీ, ఈ యేడాది కరోనా వైరస్ కారణంగా ఈ పండుగపై పలు రాష్ట్రాల్లో ఆంక్షలు విధించారు. కరోనా మహమ్మారి మరోసారి పంజా విసురుతున్న తరుణంలో అనేక రాష్ట్రాలు హోలీ వేడుకలకు అనుమతించడం లేదు. 
 
రెండు తెలుగు రాష్ట్రల విషయానికి వస్తే వేడుకలపై తెలంగాణ ఆంక్షలు విధించింది. వేడుకలకు అనుమతులు లేవని, ఆంక్షలను అతిక్రమించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 
 
గేటెడ్ కమ్యూనిటీల్లో జరుపుకునే వేడుకలపై దృష్టి సారించామని పోలీసులు తెలిపారు. ఈవెంట్ ఆర్గనైజర్లకు హెచ్చరికలు జారీ చేశారు. ఏపీలో మాత్రం కోవిడ్ నిబంధనలకు లోబడి వేడుకలను జరుపుకోవచ్చని అధికారులు తెలిపారు.
 
మరోవైపు మధ్యప్రదేశ్, బీహార్, చండీగఢ్, ఢిల్లీ రాష్ట్రాల్లో హోలీని నిషేధించారు. మహారాష్ట్రలో ముంబై, దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా నిషేధం ఉంది. 20 మంది కంటే ఎక్కువ గుమికూడవద్దని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఆదేశించింది. 
 
హోలీ వేడుకలకు ప్రభుత్వ అనుమతులు తప్పనిసరని... అనుమతి లేకుండా హోలీ నిర్వహిస్తే ఐపీసీ సెక్షన్ల కింద కేసులు పెడతామని వార్నింగ్ ఇచ్చింది. మరిన్ని రాష్ట్రాలు కూడా నిషేధం విధించే దిశగా నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయి. 
 
ప్రస్తుతం పండుగ సీజన్ కావడంతో ఉత్తరాఖండ్ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో హోళీ పండుగ సందర్భంగా ఆ రాష్ట్ర సర్కార్ కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. ప్రతి ఒక్కరూ విధిగా పాటించాలని నిర్ణయించింది.
 
హోళీకా దహన్ ఉత్సవాల్లో 60 ఏళ్ల వృద్ధులు, పదేళ్ల వయసు లోపు పిల్లలు, అనారోగ్యం, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారు పాల్గొనవద్దని ఆదేశించింది. ఈ మేరకు వారిని అనుమతించమని ఉత్తరాఖండ్ సర్కారు కొవిడ్ తాజా మార్గదర్శకాల్లో పేర్కొంది. 
 
అలాగే, కోవిడ్ కంటైన్మెంట్ జోన్లలో హోళీ వేడుకలను నిషేధించామని వెల్లడించింది. కరోనా హాట్ స్పాట్లలో ప్రజలు ఇళ్లలోనే వేడుకలు జరుపుకోవాలని సర్కారు సూచించింది. హోళీ సందర్భంగా రంగులు చల్లుకోరాదని సర్కారు ఆదేశించింది. 
 
హోలీ సందర్భంగా ఆహార పదార్థాలను పంచుకోరాదని కోరింది. కుంభమేళాలో పాల్గొనే ప్రజలు కొవిడ్ మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటించాలని ఉత్తరాఖండ్ సర్కారు ఆదేశాలు జారీ చేసింది.