శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 25 మార్చి 2021 (11:16 IST)

కరోనాకు కొత్త నిబంధనలు.. ఏప్రిల్ 1 నుంచి ప్రోటోకాల్ తప్పదు..

భారత్‌లో కరోనా వైరస్‌ వ్యాప్తి ఉద్ధృతమవుతోంది. కొత్తగా నమోదవుతున్న కేసులతో పాటు, క్రియాశీల కేసులు, మరణాల సంఖ్యలోనూ పెరుగుదల ఆందోళన కలిగిస్తోంది. క్రితం రోజుతో పోలిస్తే బుధవారం రికార్డు స్థాయిలో కేసులు నమోదయ్యాయి. గడిచిన 24గంటల్లో 10.65లక్షల పరీక్షలు చేయగా.. 53,476 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్దారణ అయినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ గురువారం వెల్లడించింది. 
 
దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,17,87,534కి చేరింది. కొత్తగా 26,490 మంది వైరస్ బారి నుంచి బయటపడ్డారు. దీంతో మొత్తం రికవరీల సంఖ్య 1,12,31,650కు చేరి.. రికవరీ రేటు 95.49శాతానికి తగ్గింది. ఇక కరోనా మరణాలు అంతకుముందు రోజు 275 నమోదు కాగా.. బుధవారం 251 మంది మరణించారు. దీంతో మహమ్మారి వెలుగులోకి వచ్చిన నాటి నుంచి దేశవ్యాప్తంగా కరోనాతో మరణించిన వారి సంఖ్య 1,60,692కి చేరింది. 
 
ఈ నేపథ్యంలో కరోనాను కట్టడి చేయడానికి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ కొత్త నిబంధనలను విడుదల చేసింది. ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఈ కొత్త నియమాలు అమలులోకి వస్తాయని తెలిపారు. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు టెస్ట్, ట్రాక్, ట్రీట్ ప్రోటోకాల్‌ను పాటించాలని సూచించారు. ఏప్రిల్ 30వ తేదీ వరకు కొత్త నియమాలు అమలు అవుతాయని, కరోనా వ్యాప్తిని నియంత్రించడంలో ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు అప్రమత్తంగా ఉండాలన్నారు. 
 
అన్ని రాష్ట్రాల్లో ఆర్‌టీపీసీఆర్ పరీక్షల సంఖ్య 70 శాతానికి పెంచాలన్నారు. పాజిటివ్‌గా నిర్ధారణ అయిన బాధితుడికి మెరుగైన చికిత్స అందించాలని ఆదేశించారు. అంతరాష్ట్ర రవాణపై ఎలాంటి ఆంక్షలు విధించరాదన్నారు.