మంగళవారం, 16 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 24 ఆగస్టు 2020 (14:20 IST)

మేము బీజేపీ ఎంజెంట్లమా? రాహుల్‌పై సిబల్ - ఆజాద్ మండిపాటు

తమను బీజేపీ ఏజెంట్లుగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పోల్చడాన్ని ఆ పార్టీ సీనియర్ నేతలైన గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్‌లు తీవ్రంగా ఆక్షేపించారు. తాము బీజేపీ ఏజెంట్లమని నిరూపిస్తే ఈ క్షణమే పార్టీకి రాజీనామా చేసి బయటకు వెళ్లిపోతామని వారు ప్రకటించారు. 
 
కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి 23 మంది సీనియర్ నేతలు లేఖలు రాశారు. దీంతో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సోమవారం ఢిల్లీలో సమావేశమైంది. ఈ సమావేశానికి 45 మందికిపైగా నేతలు హాజరయ్యారు. ఈ బేటీ వాడివేడిగా సాగుతోంది. 
 
అయితే, 23 మంది సీనియర్లు లేఖ రాయడంపై రాహుల్‌ గాంధీ అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్టీ అంతర్గత వ్యవహారాలు ఎలా బయటకు వెళ్తున్నాయని ప్రశ్నించారు. కొందరు కాంగ్రెస్ నేతలు బీజేపీ ఏజెంట్లంటూ రాహుల్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వీటిపై కాంగ్రెస్ నేతలు గులాం నబీ ఆజాద్‌, కపిల్ సిబాల్ అసంతృప్తి వ్యక్తం చేశారు.
 
రాహుల్ ఆరోపించినట్లు ఒకవేళ తాను బీజేపీ ఏజెంట్‌నే అయితే, తాను వెంటనే రాజీనామా చేసేసి బయటికి వెళ్లిపోతానని ఆజాద్ అన్నారు. సీడబ్ల్యూసీ సభ్యుల వ్యవహారశైలి బాగోలేకపోవడంతోనే తాము లేఖ రాశామని చెప్పారు. 
 
తాము బీజేపీతో కుమ్మక్కయ్యామని అనడం ఏంటంటూ కపిల్ సిబాల్ కూడా ట్విట్టర్‌లో రాహుల్ గాంధీని ప్రశ్నించారు. రాజస్థాన్ హైకోర్టులో విజయవంతంగా వాదించి కాంగ్రెస్‌ను కాపాడామని, మణిపూర్‌లో బీజేపీని గద్దెదించి కాంగ్రెస్‌ను రక్షించామని, తాను 30 ఏళ్లలో బీజేపీకి అనుకూలంగా ఒక్క ప్రకటనైనా చేయడం చూశారా? అని ప్రశ్నించారు.