శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 24 ఆగస్టు 2020 (13:27 IST)

రాసలీలల స్వాములోరు దేశంలో హోటల్ ప్రారంభిస్తా: తమిళ పారిశ్రామికవేత్త

ఆధ్యాత్మిక ముసుగులో పలు అక్రమాలకు పాల్పడటమే కాకుండా, ప్రముఖ సినీ నటితో రాసలీలలు కొనసాగిస్తూ పట్టుబడిన దొంగబాబు నిత్యానంద స్వామి. ఈయన పలు కేసులు ఉన్నాయి. అలాంటి వాటిలో ఆడపిల్లల అక్రమ నిర్బంధ, మహిళలపై అత్యాచారం, ఆశ్రయంలో విదేశీయుల నిర్బంధం ఇలా చెప్పుకుంటూ పోతే అనేకం ఉన్నాయి. పైగా, రాసలీలల కేసులో ఈ స్వామిజీ అరెస్టు అయ్యారు. ఆ తర్వాత ఆయన బెయిలుపై విడుదలయ్యారు. 
 
అక్కడే ట్విస్ట్ మొదలైంది. బెయిలుపై విడుదలైన నిత్యానంద స్వామి నరమానవుడికి కనిపించకుండా నకిలీ పాస్‌పోర్టుతో కరేబియన్ దీవులకు వెళ్లిపోయారు. అక్కడ ఏకంగా ఏ దీవిని కొనుగోలు చేసి దానికి కైలాస దేశం అని పేరు పెట్టారు. అంతేనా.. తమ దేశానికి రాజు, ప్రధానమంత్రిగా తానే ఉంటానని ప్రకటించారు. పైగా, దేశానికి కరెన్సీ నోట్ల చెలామణి కోసం ఏకంగా ఓ రిజర్వు బ్యాంకును కూడా ఏర్పాటు చేశారు. 
 
దీనికి కైలాస రిజర్వు బ్యాంకు అని నామకరణం చేశారు. ఈ బ్యాంకు విడుదల చేసినట్టుగా కరెన్సీ నోట్లు, బంగారు నాణేలను రిలీజ్ చేశారు. కరెన్సీ నోట్లపై తన ఫోటోను ముద్రించుకున్నారు. పైగా, తమ దేశ కరెన్సీ నోట్లు చెల్లుబాటయ్యేలా పలు దేశాలతో ఓ అవగాహనా ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్టు చెప్పాడు. అలాగే, తమ దేశంలో ఎవరైనా వచ్చి పెట్టుబడులు పెట్టవచ్చని ప్రకటించారు. 
 
ఆయన పిలుపు మేరకు... తమిళనాడుకు చెందిన కుమార్ అనే వ్యాపారవేత్త కైలాస దేశంలో హోటల్ వ్యాపారం ప్రారంభించేందుకు ఉవ్విళ్లూరుతున్నాడు. మదురైలో టెంపుల్ సిటీ హోటల్ పేరిట వ్యాపారం చేస్తున్న కుమార్ మదురై జిల్లా హోటల్ యజమానుల సంఘానికి అధ్యక్షుడు కూడా. 
 
అయితే కైలాస దేశం ఏర్పాటైన నేపథ్యంలో, తనకు ఆ దేశంలో హోటల్ ప్రారంభించేందుకు అనుమతి ఇవ్వాలంటూ నిత్యానందకు కుమార్ లేఖ రాశారు. మంచి భోజనం అందిస్తూ అతిథులను ఆకట్టుకోవడమే కాకుండా, దేశాభివృద్ధికి తోడ్పడతానని కుమార్ తన లేఖలో పేర్కొన్నారు. మరి ఈ లేఖపై నిత్యానంద ఏ విధంగా స్పందిస్తారో చూద్ధాం.