1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : బుధవారం, 24 జూన్ 2020 (08:35 IST)

ఫ్యాన్లతో చిన్నారులకు ముప్పే?

ఎలక్ట్రిక్‌ వస్తువులు విద్యార్థుల ఏకాగ్రతకు భంగం కలిగిస్తున్నాయని నీల్సన్‌ సంస్థ నిర్వహించిన సర్వే అధ్యయనంలో స్పష్టమైంది. ముఖ్యంగా ఫ్యాన్లు పరీక్షలప్పుడు విద్యార్థుల ప్రశాంతతను దెబ్బతీస్తున్నాయట.

ఒక్క సీలింగ్‌ ఫ్యాన్‌ చప్పుడు కారణంగా తమ పిల్లలు చదవడం లేదని 47 శాతం తల్లిదండ్రులు అంటున్నారు. ఫ్యాన్లతో సహా ఇతర ఎలక్ట్రిక్‌ ఉపకరణాల శబ్దాలతో ప్రశాంతమైన వాతావరణం కొరవడి, పిల్లలు ఏకాగ్రతను కోల్పోతున్నారని ఈ అధ్యయనం వెల్లడించింది.

పగటి పూట వినిపించే హారన్ల నుంచి మొదలుకుని, రాత్రివేళ ఫ్యాన్ల శబ్దాల వరకు విద్యార్థులు చదువుకోలేని వాతావరణాన్ని కల్పిస్తున్నాయని అధ్యయనంలో స్పష్టమైంది. పిల్లలు ప్రశాంతంగా చదువుకోవడానికి వీలుగా ఇండ్లలో సైలెంట్‌ జోన్లను ఏర్పాటు చేయాలని సర్వేలో పాల్గొన్న తల్లిదండ్రులు అభిప్రాయపడ్డారు.

ముంబై, హైదరాబాద్‌, బెంగళూరు, అహ్మదాబాద్‌, చెన్నై నగరాల్లో ఈ సంస్థ సర్వే నిర్వహించింది. కేవలం తల్లిదండ్రుల నుంచే  అభిప్రాయాలను సేకరించింది. 
 
సర్వేలో ప్రధాన అంశాలు..
పిల్లల కోసం ఎలాంటి అంతరాయాలు లేకుండా నిశ్శబ్ద వాతావరణాన్ని సృష్టించడం అవసరమని, ఇందుకోసం ఇంట్లో సైలెంట్‌ జోన్‌ను ఏర్పాటు చేయడం ఉత్తమమని 75 శాతం తల్లిదండ్రులు భావిస్తున్నారు.
 
 పిల్లల దృష్టి మరలించడంలో ఎలక్ట్రిక్‌ ఉపకరణాలు కీలకమవుతున్నాయని, ఫ్యాన్లు, కూలర్లు  ఏకాగ్రతను ప్రభావితం చేస్తున్నాయని 51 శాతం నమ్ముతున్నారు.
 
పరీక్షల సమయంలో శబ్దాలు లేని ఎలక్ట్రిక్‌ ఫ్యాన్ల వల్ల సానుకూల వాతావరణం ఏర్పడుతుందని 69 శాతం మంది అభిప్రాయపడ్డారు.